జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం.. నాదెండ్ల మనోహర్ ఏమన్నారో తెలుసా?
Nadendla Manohar: ప్రజల సమస్యలపై స్పందించే మనస్తత్వం జనసేన పార్టీకి ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 28 తేది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విజయవాడ బావనిపురంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని చెప్పారు.
ప్రస్తుతం 6 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి 10 లక్షలు దాటాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారిని సహృదయంతో చేర్చుకోవాలని చెప్పారు. తాము సభ్యత్వంతో పాటు రూ.5 లక్షల బీమా ఇస్తున్నామని అన్నారు. తమ కార్యకర్తలే జనసేనను ఇంతవరకూ తీసుకుని వచ్చారని తెలిపారు.
వారు సొంత ధనాన్ని ఖర్చు పెట్టుకుని అనేక పోరాటాలు చేశారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ మూడేళ్లలో 20 కోట్ల రూపాయల బీమా ఇచ్చామని తెలిపారు. తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ వ్యక్తిత్వం వల్లే ప్రజల్లో పార్టీకి విలువ వచ్చిందని చెప్పారు.
ప్రజల సమస్యలపై స్పందించే మనస్తత్వం జనసేన పార్టీకి ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికల ముందు కొందరు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటినుంచే అంకితభావంతో పని చేయాలని అన్నారు.
Also Read: రుణమాఫీ చేస్తున్నామని ఇలా పోజులు కొడుతున్నారు: కేటీఆర్