కరోనా వైరస్ మర్చిపోకముందే : కోనసీమలో కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి.

  • Published By: veegamteam ,Published On : February 3, 2020 / 06:49 AM IST
కరోనా వైరస్ మర్చిపోకముందే : కోనసీమలో కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు

Updated On : February 3, 2020 / 6:49 AM IST

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి.

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి. దాదాపుగా 15వేలమంది ఈ వైరస్ బారిన పడినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఈ వైరస్ 17 దేశాల్లో వ్యాపించినట్టు సమాచారం. చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమను కొత్త రకం వైరస్ భయపెడుతోంది. జంతువుల ఉసురు తీస్తోంది. అదే… హెర్సిస్ వైరస్(hersis virus) భయపెడుతున్నది. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్(lump skin) వ్యాధి బారిన పడుతున్న మూగజీవాలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.

వ్యాధికి మందు లేదు:
కోనసీమను లంపి స్కిన్(lump skin) వ్యాధి వణికిస్తోంది. హెర్సిస్ వైరస్ వల్ల ఈ వ్యాధి మూగజీవాలకు వస్తుంది. ఒడిశా నుండి వచ్చిన ఈ వైరస్‌కు మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తమ పాడి పాలిట శాపంగా మారిన ఈ లంపి స్కిన్ వైరస్ నుంచి కాపాడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పాడి పంటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కోనసీమలో ఈ లంపి స్కిన్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముమ్మిడివరం, అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రావులపాలెం, కాట్రేనికోన, ఆలమూరు మండలాల్లో వేలాది పశువులు ఈ లంపి స్కిన్ వ్యాధి బారిన పడ్డాయి. ఇప్పటివరకు వెయ్యికి పైగా పశువులు ఈ వైరస్ బారిన పడగా వాటిలో ఇరవైకి పైగా ఆవులు మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు.

కొన్ని రోజుల వ్యవధిలోనే మృత్యువాత:
ఈ వైరస్‌(virus) బారిన పడితే.. 104 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదై కళ్లు, ముక్కు నుండి నీళ్లు కారడం, నోటి నుంచి చొంగ కారడంతోపాటు చర్మం కింద కణుతులు ఏర్పడి పుండుగా మారతాయంటున్నారు. పుండుగా మారిన కొన్ని రోజులకే గోవులు బలహీన పడి మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీని వలన పశువుల్లో పాల ఉత్పత్తి పడిపోవడంతో పాటు పెరుగుదల కూడా తగ్గిపోతుందని అంటున్నారు.

ఒడిశా నుంచి వచ్చింది:
తూర్పుగోదావరి జిల్లాలో పశువులకు లంప్ స్కిన్ వైరస్ వ్యాపిస్తోంది. దీని బారినపడి ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులు మృతి చెందగా.. వేల సంఖ్యలో పశువులు చికిత్స పొందుతున్నాయి. ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ఈ వైరస్ తూర్పుగోదావరి జిల్లాకు వ్యాపించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. భారత దేశంలో ఈ వైరస్‌కు మందులు అందుబాటులో లేకపోవడంతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు.

4 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి గురించి తెలుస్తుంది:
లంపి స్కిన్ వైరస్ లేదా బొలైన్ హెర్సిస్ వైరస్ -2 అనే సూక్ష్మజీవుల వలన ఈ వ్యాధి వస్తుందంటున్నారు పశువైద్యులు. ఈ వ్యాధి కీటకాలు, స్రావాలు, క్రిములతో కలుషితమైన గాలి ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకర పశువు శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిన 4 నుంచి 14 రోజుల తరువాత ఈ వ్యాధి బయపడే అవకాశం ఉందంటున్నారు. ఈ వైరస్ పశువుల నుంచి కోళ్లకు ఇతర జంతువులకు కూడా వ్యాపించే అవకాశం ఉందనే పుకార్లు షికార్లు చేయడంతో కోనసీమ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

* హెర్సిస్ వైరస్ సోకిన వాటి చర్మంపై బొబ్బలు వస్తాయి
* ఆ బొబ్బలు పగిలి రంధ్రాలు ఏర్పడటంతో చనిపోతున్నాయి
* కొన్ని రోజుల్లోనే వేలాది కోళ్లు మృత్యువాత
* వైరస్ సోకిన కోళ్లు లంపి స్కిన్ వ్యాధితో మరణం

* వైరస్ ను తగ్గించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు
* ప్రస్తుతం కోళ్లకు మాత్రమే ఎటాక్ అవుతున్న హెర్సిస్ వైరస్
* ముందు ముందు మనిషికి ఎలాంటి ప్రమాదం ఉంటుందోనని భయాందోళన