ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం

SEC decesion on ZPTC, MPTC Election nominations : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో జిల్లా కలెక్టర్ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. పలు పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరి 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో నామినేషన్లు వేసేప్పుడు ప్రత్యర్ధులు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను, టీవీ వీడియో క్లిప్పింగుల ఆధారాలను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ తెలిపింది.
ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. విజువల్స్ ఆధారంగా కూడా బాధితులు కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనతో తెలియ చేసింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని నిమ్మగడ్డ రమేష్కుమార్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ పలు జిల్లాల్లో పర్యటించినప్పుడు…. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల కారణంగా నామినేషన్ వేయనివారికి తిరిగి అవకాశం కల్పించాలని పలువురు ఆయన్ను కలిసి కోరారు.
దీంతో ఆయన గుంటూరులోని మాచర్ల, కడపలోని పులివెందుల, రాయచోటి, చిత్తూరులోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో సింగిల్ నామినేషన్లపై అధికారులను రమేశ్ కుమార్ నివేదిక కోరారు. ఈనెల 20 లోపు వాటిపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్ధులను బెదిరిస్తున్నారని రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఆ వార్డుల్లో నామినేషన్లు తీసుకోవాలని సూచించారు.
బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయా రాజకీయపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రమేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.