11 మంది చనిపోయినప్పటికీ, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదు: జగన్

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారని తెలిపారు.

YS JaganMohan Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 11 మంది చనిపోయినప్పటికీ, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదని తెలిపారు.

సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

లిక్కర్‌, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారని జగన్ అన్నారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చంద్రబాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదని చెప్పారు.

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారని, జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని చెప్పారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారని, విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీలను నిర్వీర్యం చేశారని తెలిపారు.

ఫ్యామిలీ డాక్టర్‌ ఊసేలేదని, ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయని అన్నారు. కొత్త మెడికల్‌ కాలేజీలను అస్తవ్యస్తం చేశారని, స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారని అన్నారు.

రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం.. టార్గెట్ మూడేళ్లు..