YS Jagan: కళ్లుమూసి తెరిచేలోపు ఏడాది గడచిపోయింది.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే..: వైఎస్ జగన్
తాను హామీ ఇచ్చానంటే నెరవేర్చుతానన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని జగన్ చెప్పారు.

YS Jagan
కళ్లుమూసి తెరిచేలోపు ఏడాది గడచిపోయిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అన్నారు. వైసీపీ 15వ ఆవిర్భావ వేడుకల వేళ తాడేపల్లి పార్టీ కేంద్ర ఆఫీసులో జగన్ పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
తమ పార్టీ ఆవిర్భవించి పదిహేనేళ్లు అవుతుందని, తమకు ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదని జగన్ అన్నారు. తాము మొదట పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తుచేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని చెప్పారు. వైసీపీ ఏదైనా హామీ ఇస్తే తప్పక చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. ఫీజు రీయంబర్స్మెంట్కు ఏడాదికి 2800 కోట్ల రూపాయలు కావాలని చెప్పారు. వసతి దీవెనకు 1100 కోట్ల రూపాయలు కావాలని అన్నారు.
తాను హామీ ఇచ్చానంటే నెరవేర్చుతానన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని జగన్ చెప్పారు. ప్రజల్లోకి వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్లే స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రజలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.