YSR Zero Interest : నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’.. రూ.128.47 కోట్ల రాయితీ

రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు.

YSR Zero Interest : నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’.. రూ.128.47 కోట్ల రాయితీ

Ysr Zero Interest Crop Loan Scheme

Updated On : April 20, 2021 / 9:20 AM IST

YSR Zero Interest : రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు.

రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019–20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.

ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్‌ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది.

గత ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.61,400 కోట్ల సాయం చేసింది.