WhatsApp Exit India : యూజర్ల మెసేజ్ ఎన్క్రిప్షన్ బ్రేక్ చేస్తే.. భారత్ నుంచి నిష్ర్కమిస్తాం : వాట్సాప్ వెల్లడి!
యూజర్ల మెసేజ్లను ప్రొటెక్ట్ చేసే ఎన్క్రిప్షన్తో రాజీపడవలసి వస్తే కంపెనీ భారతీయ మార్కెట్ నుంచి నిష్క్రమించక తప్పదని వాట్సాప్ ప్రతినిధి స్పష్టం చేశారు.
WhatsApp Exit India : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ ప్లాట్ఫారమ్లలో వాట్సాప్ ఒకటి. మెటా-యాజమాన్యమైన సంస్థ యూజర్ల ప్రైవసీకే కట్టుబడి ఉంది. ప్లాట్ ఫారంపై మెసేజ్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. తద్వారా యూజర్ల మెసేజ్ డేటా, సెండర్, రిసీవర్కు మధ్య ఉంటుందని వాట్సాప్ పదపదే చెబుతోంది. మీరు ఏది షేర్ చేసినా.. అది మీ మధ్యనే ఉంటుంది. ఎందుకంటే.. మీ వ్యక్తిగత మెసేజ్లు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందని పేర్కొంది.
యూజర్ల భద్రతను ఎప్పటికీ ఉల్లంఘించమని తేల్చిచెప్పింది. ప్రతి చాట్ను స్పష్టంగా లేబుల్ చేస్తామని, తద్వారా కంపెనీ నిబద్ధత యూజర్లకు తెలుస్తుందని కంపెనీ FAQ పేజీలో పేర్కొంది. అయితే, భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం.. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను డీక్రిప్ట్ చేయాలని సూచించింది. ఇటీవలి నివేదికల ప్రకారం.. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను డీక్రిప్ట్ చేస్తే.. భారత్ నుంచి నిష్క్రమిస్తామని విచారణ సందర్భంగా వాట్సాప్ హైకోర్టుకు తెలిపింది.
1. ఫిబ్రవరి 2021లో భారత ప్రభుత్వం కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ని ప్రకటించింది. ఇందులో మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఉన్నాయి. మెసేజ్ మూలాలను గుర్తించడానికి కేంద్రప్రభుత్వం దృఢమైన వైఖరిని ముందుకు తెచ్చింది. దీని అర్థం.. వాట్సాప్ సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫారమ్లు మెసేజ్ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ని ఉపయోగించే ఇతర ప్లాట్ఫారమ్లు ప్రభుత్వ కొత్త నియమానికి అనుగుణంగా డీక్రిప్ట్ చేయాల్సి ఉంటుంది.
2. ఢిల్లీ హైకోర్టులో జరిగిన సెషన్లో, వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో కలిసి 2021 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) నిబంధనలను వ్యతిరేకించింది. యూజర్ల మెసేజ్లను ప్రొటెక్ట్ చేసే ఎన్క్రిప్షన్తో రాజీపడవలసి వస్తే కంపెనీ భారతీయ మార్కెట్ నుంచి నిష్క్రమించక తప్పదని వాట్సాప్ ప్రతినిధి స్పష్టం చేశారు. యూజర్ ప్రైవసీ అనేది ప్లాట్ఫారమ్ నిబద్ధత, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ల విశ్వాసానికి ప్రధానమైనదిగా పేర్కొన్నారు.
3. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనం ముందు వాట్సాప్ తరపున న్యాయవాది తేజస్ కరియా వాదించారు. వాట్సాప్మెసేజ్లను డీక్రిప్ట్ చేయమని బలవంతం చేయడం ప్లాట్ఫారమ్ ప్రైవసీ హామీలను ప్రాథమికంగా మారుస్తుందని అభిప్రాయపడ్డారు. మిలియన్ల కొద్దీ మెసేజ్లు, యూజర్ల ప్రైవసీని ప్రభావితం చేసే అవకాశం ఉందని కరియా చెప్పారు. అంతేకాదు.. లాజిస్టికల్, నైతిక సవాళ్లను కూడా ఆయన లేవనెత్తారు.
4. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ హక్కుల నియంత్రణలో సంక్లిష్టతను న్యాయస్థానం అంగీకరించింది. ప్రైవసీ అనేది పూర్తి స్థాయిలో కుదరదని, సర్దుబాట్లు అవసరమని సూచించింది. దీనిపై వాట్సాప్ తరపు న్యాయవాది కరియా స్పందిస్తూ.. మెసేజ్ డిక్రిప్షన్ అవసరమయ్యే సారూప్య చట్టాలు ప్రపంచవ్యాప్తంగా మరెక్కడా లేవని, కఠినమైన ఇంటర్నెట్ నిబంధనలకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా లేవని పేర్కొన్నారు.
5. మతపరమైన హింసాత్మక సంఘటనల సమయంలో అభ్యంతరకరమైన కంటెంట్ వ్యాప్తికి వాట్సాప్ వంటి ప్లాట్ఫారమ్లను ఉపయోగాన్ని కొత్త నిబంధనలతో నిరోధించవచ్చునని భారత ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్థించారు. అయితే, దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.