Bride Escaped : కొద్ది గంటల్లో ముహూర్తం-పెళ్లి కూతురు అదృశ్యం
కొద్ది గంటల్లో పెళ్లి ముహూర్తం ఉండగా పెళ్ళి కూతురు కళ్యాణ మండపం నుంచి ఆదృశ్యమయ్యింది.
Bride Escaped : కొద్ది గంటల్లో పెళ్లి ముహూర్తం ఉండగా పెళ్ళి కూతురు కళ్యాణ మండపం నుంచి ఆదృశ్యమయ్యింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా కనిపించక పోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్కు వెళ్లారు. అదే సమయానికి తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుని పోలీసు స్టేషన్కు వచ్చింది పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా మదన పల్లె మండలం తట్టివారి పల్లెకు చెందిన రామకృష్ణ, మల్లిక దంపతుల కుమార్తె సోనికకు అదే ఊరుకి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడితో వివాహం నిశ్చయమయ్యింది. నవంబర్ 14వతేదీ ఉదయం గం. 5-30 కి వివాహా ముహుర్తం నిశ్చయించుకున్నారు. శనివారం రాత్రి కళ్యాణమండపంలో రిసెప్షన్ జరిగింది. ఇరువైపులా కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఉదయం పెళ్లి కోసం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు.
ఆదివారం తెల్లవారు ఝూమున పెళ్లి కూతురుని రెడీ చేయటానికి ఆమె గదికి వెళ్లిన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. అక్కడ పెళ్ళి కూతురు లేదు. అర్ధరాత్రి సమయంలో ఎవరి కంట పడకుండా పెళ్ళి కూతురు కళ్యాణ మండపం నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు బంధువులు తెలిసిన చోట అంతా వెతికారు.
ఎక్కడా ఆమె ఆచూకి లభించలేదు. దీంతో ఇరువర్గాల వారు పోలీసు స్టేషన్ కు చేరుకుని పెళ్ళి కూతురు తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు.
సోనిక గొల్లపల్లెకు చెందిన చరణ్ అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ పుంగునూరులోని ఒక గుడిలో ఆదివారం ఉదయం వివాహం చేసుకున్నారు. ఇరువర్గాల వారు పోలీసు స్టేషన్ లో ఉన్న సమయంలోనే పెళ్లి కూతురు సోనిక తానుప్రేమించిన ప్రియుడు చరణ్ను పెళ్లి చేసుకుని రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. యువతి మేజర్ కావటంతో ఆమె ఇష్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పోలీసులు ఇరువర్గాలకు తేల్చి చెప్పారు.
Also Read : Wife Harassment : భార్య వేధింపులతో బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం
ఈసందర్భంగా వధువు సోనిక మాట్లాడుతూ… ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని డయల్ 100 కి నవంబర్ 3న ఫోన్ చేసి చెప్పానని…. అప్పుడు పొలీసులు వచ్చి నా తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారని చెప్పింది. పోలీసులకు పెళ్లి చేయమని చెప్పి….నన్ను గృహ నిర్భంధం చేశారని వివరించింది.
అందుకే అందరూ నిద్రపోయాక కళ్యాణ మండపం నుంచి పారిపోయి తాను ప్రేమించిన వ్యక్తితో పుంగనూరులో తాళి కట్టించుకుని వచ్చానని వివరించింది. అయితే పెళ్ళి తప్పిపోయిన వరుడు నవీన్ కుమార్ బంధువులు తాము పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని తమకు అవమానం జరిగిందని ఆరోపించారు. కాగా సోనిక ఎంబీఏ చదివి స్ధానిక గురుకుల పాఠశాలలో సూపర్ వైజర్ గా పని చేస్తోంది.