పోలీసులకే సవాల్ : మగ దొంగ.. ఆడగా మారితే

హైదరాబాద్: కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసు పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో అర్థం కాక పోలీసులు పరేషాన్ అవుతున్నారు. క్లారిటీ కోసం డాక్టర్లను ఆశ్రయించారు. కార్ల చీటింగ్ కేసులో 2019, జనవరి 3వ తేదీ గురువారం పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన సయ్యద్ సిరాజ్ హుస్సేన్ అడ లేక మగ అనే విషయం తెలియక పోలీసులు కన్ఫ్యూజ్లో పడ్డారు.
కేసు విచారణలో సిరాజ్ హుస్సేన్ను మగ మనిషిగా భావించిన పోలీసులు ఆ మేరకు విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించి డైరీ నమోదు సమయంలో జెండర్ కాలమ్ నింపే టైంలో తాను ఆడ అని సిరాజ్ హుస్సేన్ చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. మూడేళ్ల క్రితం ముంబైలో లింగ మార్పిడి చేయించుకున్నట్లు సిరాజ్ చెప్పడంతో పోలీసులు మరింత డైలమాలో పడ్డారు. తన పేరు సయ్యద్ సిరాజ్ హుస్సేన్ కాదని, షాభిన అస్మి అని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా ఫతేపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిని చెబుతున్నాడు.. సారీ చెబుతోంది. దీంతో తలపట్టుకోవడం కుషాయిగూడ పోలీసుల వంతైంది.
అరెస్ట్ చేసిన వ్యక్తి ఆడ లేక మగ తేలిన తర్వాతే ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఆ వ్యక్తికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా గాంధీ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగానికి లేఖ రాశారు పోలీసులు. వైద్యుల నివేదిక ఆధారంగా నిందిత వ్యక్తి ఆడ, మగ అన్నది తేల్చుకుని.. జెండర్ కాలమ్ నింపాకే కేసులో ముందుకెళ్తామని పోలీసులు చెబుతున్నారు.