Burglars Arrest : టెక్నాలజీ పెరిగిపోతున్న ఈరోజుల్లో నేరాల దర్యాప్తులో నిందితులను పట్టుకోటానికి పోలీసులకు సీసీటీవీ ఫుటేజి ఉపయోగ పడుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇండియాలోని తన ఇంటిని సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో పెట్టిన యువకుడు… ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలను న్యూజెర్సీ నుంచి సీసీటీవీలో లైవ్ చూసి పోలీసులకు పట్టిచ్చిన ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన విజయ్ అవస్తి అనే యువకుడు సాప్ట్వేర్ ఇంజనీర్గా న్యూజెర్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇండియాలోని అతని కుటుంబ సభ్యులను కూడా న్యూజెర్సీ తీసుకువెళ్లాడు. కాన్పూర్ లోని తన ఇంటి చుట్టూ.. ఇంటి లోపల సీసీటీవీ లు బిగించి వాటిని తన మొబైల్ ఫోన్లో కనపడేలా అమర్చుకున్నాడు. ఇండియాలోని తన ఇంటిలో మైక్ సిస్టం కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
సోమవారం అర్ధరాత్రి న్యూజెర్సీలో అతని ఫోన్కు అలర్ట్ మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమై చూసుకోగా కాన్పూర్ లోని తన ఇంట్లోకి దొంగలు ప్రవేశించినట్లు తెలుసుకున్నాడు. వెంటనే వారిని మైక్ ద్వారా హెచ్చరించాడు. అయినా వారు అతని మాటలు లెక్క చేయక సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు.
Also Read : Chain Snatching : సికింద్రాబాద్లో వరుస చైన్స్నాచింగ్ లు
విజయ్ అవస్తి వెంటనే కాన్పూర్ శ్యాంనగర్లో నివాసం ఉండే తన మిత్రుడుకి సమాచారం ఇచ్చాడు. ఆవ్యక్తి పోలీసులను అలర్ట్ చేశాడు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి వచ్చారు. దొంగలను పట్టుకోటానికి ప్రయత్నించగా వారు పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా దొంగల కాళ్లపైకి కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.