విచారణ ఇలా : చిగురుపాటి హత్య కేసులో ఆమె ఎవరు?

  • Published By: chvmurthy ,Published On : February 2, 2019 / 11:13 AM IST
విచారణ ఇలా : చిగురుపాటి హత్య కేసులో ఆమె ఎవరు?

Updated On : February 2, 2019 / 11:13 AM IST

విజయవాడ: కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్, ఎన్ఆర్ఐ,ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. హత్యకు గురైన చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు హైదరాబాదు నుంచి నందిగామకు తీసుకుని వచ్చి ప్రశ్నిస్తున్నారు. జయరాం కారును ఓ తెల్లటి దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి నడిపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా బయటపడింది. చిగురుపాటి జయరాం కారులో ఓ మహిళ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

1. హత్య జరిగిన సమయంలో కారులో ఉన్న మహిళ ఎవరు?
2. భార్యా పిల్లలకు ఇవ్వని ప్రాముఖ్యం ఆమెకు ఎందుకు ఇచ్చారు?
3. జయరామ్ కారును నడిపిందెవరు?
4. హైదరాబాదు నుంచి బయలుదేరిన సమయంలో కారులో ఉన్నదెవరు?
5. జయరాం చివరి కాల్ ఎవరికి చేశారు?
6. తల్లి అంత్యక్రియల రోజు ఇంట్లో జరిగిన గొడవలు ఏమిటి?
7. విజయవాడ ఔటర్ వద్ద ఉన్న ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది?

చిగురుపాటి జయరాం కాల్ డేటా ఆధారంగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జయరాంను విషప్రయోగం చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శరీరం నీలం రంగుకు మారి ఉండడం వల్ల పోలీసులు ఆ నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా, చిగురుపాటికి బలమైన గాయాలు తగలలేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. 

అయితే ఆయన ముక్కు నుంచి, చెవుల నుంచి రక్తం కారినట్లు గుర్తించారు. మద్యంలో సైనెడ్ కలిపి తాగించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. గురువారం సాయంత్రం మాత్రం తాను విజయవాడ వస్తున్నానని బస చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ విజయవాడలో ఉన్న తన సిబ్బందికి ఫోన్‌ ద్వారా మేసేజ్‌ పంపించారు. తర్వాత ఆయన భార్యతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో ఏం మాట్లాడారనే విషయాలు తెలియరాలేదు. రెండేళ్లుగా ఆయనకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని తన బస ఏర్పాట్ల గురించి పంపిన మేసేజ్‌ ఆయన ఫోన్‌ నుంచి వెళ్లిన లాస్ట్‌ మేసేజ్‌గా పోలీసులు గుర్తించారు. తరువాత కొద్ది గంటల్లోనే ఆయన అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డారు. కాగా, ఆయన హత్యకు సంబంధించి పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

ఇది ఇలా ఉంటే పది రోజులుగా జయరాం పేరుతో హోటల్లో ఓ గది బుక్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ హోటల్లోనే ఆయన హత్యకు స్కెచ్ వేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. హైదరాబాదు కేంద్రంగానే ఆయన హత్యకు కుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.