ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం : 83 మంది మృతి

ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈఫ్రమాదంలో మరిణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. విమానం ఏదైనా సాంకేతిక కారణాలతో కూలిందా…లేక తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.
మొదట కూలిన విమానం ఆఫ్గాన్ కు చెందిన ఏరియానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంగా వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలను ఏరియానా విమానయాన సంస్ధ కొట్టి పారేసింది. తమ విమానాలన్నీ బాగానే తిరుగుతున్నాయని వేటికీ ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ఈ రోజు తాము రెండు విమానాలను నడిపామని ఏరియానా సంస్థ వెల్లడించింది.
ఒకటి హెరాత్ నుంచి కాబుల్కు మరొకటి హెరాత్ నుంచి ఢిల్లీకి సురక్షితంగా వెళ్లాయని తెలిపారు. కాగా హిందూకుష్ పర్వతాల దగ్గర ఉన్న ఘాంజీ ప్రావిన్స్లో శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. 2005లో ఇదే ప్రాంతంలో మంచు కారణంగా ఘోర విమాన ప్రమాదం జరిగింది. అనేకమార్లు సైన్యం విమానాలు కూడా కూలిపోయాయి. ఇక తాలిబన్ల పాలనలో దేశీయ విమానయాన రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోంది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఒకే ఒక్క విమానయాన సంస్ధ ఏరియానా కూడా తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కాగా… ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం తాలిబన్లు ఆధీనంలో ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత తాలిబన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంతం తాలిబన్ల ఆధీనంలో ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడానికి వారితో ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంది. గజనీ ప్రావిన్షియల్ గవర్నర్ అధికారిక ప్రతినిధి ఆరిఫ్ నూరి ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు.