తప్పు ఒకరిది శిక్ష మరొకరికి : సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణం తీసిన బ్యానర్

తమిళనాడులో దారుణం జరిగింది. నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది. పెళ్లి బ్యానర్ ఆ యువతి పాలిట యమపాశమైంది. స్కూటర్‌ మీద బ్యానర్‌ పడడంతో బండి అదుపు తప్పింది. స్కూటర్‌

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 05:29 AM IST
తప్పు ఒకరిది శిక్ష మరొకరికి : సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణం తీసిన బ్యానర్

తమిళనాడులో దారుణం జరిగింది. నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది. పెళ్లి బ్యానర్ ఆ యువతి పాలిట యమపాశమైంది. స్కూటర్‌ మీద బ్యానర్‌ పడడంతో బండి అదుపు తప్పింది. స్కూటర్‌

తమిళనాడులో దారుణం జరిగింది. నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది. పెళ్లి బ్యానర్ ఆ యువతి పాలిట యమపాశమైంది. స్కూటర్‌ మీద బ్యానర్‌ పడడంతో బండి అదుపు తప్పింది. స్కూటర్‌ నుంచి కింద పడ్డ యువతిపై వెనుక నుంచి వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమె స్పాట్ లోనే చనిపోయింది. వివరాల్లోకి వెళితే పల్లావరం రేడియల్ రోడ్డు సమీపంలో పళ్లికరణై దగ్గర ఈ ఘోరం జరిగింది. సుభశ్రీ(22) అనే యువతి ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి ఇంటికి స్కూటర్‌ మీద వెళ్తోంది. ఆ సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. పెళ్లి ఆహ్వానం పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్‌ నేలకొరిగి స్కూటర్‌పై పడింది. దీంతో అదుపు తప్పి ఆ యువతి కూడా కింద పడింది. అదే సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆమె మీదుగా వెళ్లడంతో మృతిచెందింది. గురువారం(సెప్టెంబర్ 12,2019) సాయంత్రం ఈ విషాదం జరిగింది.

అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరికలు, ఆదేశాలు ఇచ్చినా వాటిని లెక్క చెయ్యడం లేదు. అలా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బ్యానర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ బ్యానర్ ని అధికార పార్టీకి చెందిన అన్నాడీఎంకే నేత ఏర్పాటు చేశారు. తన కొడుకు పెళ్లి బ్యానర్ అక్కడ తగిలించారు. సమీపంలోని ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతోంది. దీంతో ఆయన రోడ్డు మీద బ్యానర్ ని ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

ఎలాంటి అనుమతి లేకుండా బ్యానర్ ని ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ మార్గంలో ఇష్టానుసారంగా రాజకీయ నేతలు బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తున్నారని, వాటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వాపోయారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగినా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే.. ఈ రోజు శుభశ్రీ ప్రాణంపోయేది కాదని అంటున్నారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేసిన అధికార పార్టీ నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీసులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మనోజ్ యాదవ్(28)ని అరెస్ట్ చేశారు. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నామని తప్పు చేసినట్టు తేలితే.. అన్నాడీఎంకే నేతపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన దారిలో సుమారు 50 బ్యానర్లు దారిపొడవునా ఉన్నాయి. అవన్నీ పర్మిషన్ లేకుండా పెట్టినవే. నేతలు తమ డబ్బు, అధికార బలంతో రూల్స్ కి విరుద్ధంగా వెళ్తున్నారు. శుభ్రశ్రీ మరికొన్ని రోజుల్లో కెనడా వెళ్లాల్సి ఉంది. అక్కడ కొత్త ఆఫీస్ లో పని చేయాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలో శుభశ్రీకి ఇలా జరగడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు, సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరో చేసిన తప్పుకి శుభశ్రీ బలైందని కన్నీటిపర్యంతం అయ్యారు.