CBSE కీలక నిర్ణయం…10,12 తరగతులకు 30శాతం సిలబస్ తగ్గింపు

  • Published By: venkaiahnaidu ,Published On : July 7, 2020 / 08:57 PM IST
CBSE కీలక నిర్ణయం…10,12 తరగతులకు 30శాతం సిలబస్ తగ్గింపు

Updated On : July 7, 2020 / 9:25 PM IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్‌ను తగ్గించింది. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. విద్యావేత్తలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నందున ఇప్పటికే 10, 12వ తరగతి పరీక్షలని సీబీఎస్ఈ రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా పరీక్షలను రద్దుచేస్తున్నట్లు తెలిపింది.

ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా విద్యార్థులకు మార్కుల్ని వేయనుంది సీబీఎస్ఈ. మూడు పేపర్స్ అసెస్‌మెంట్ ద్వారా ఈ మార్కులు ఉంటాయి. జూలై 15 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయనుంది సీబీఎస్ఈ.

కాగా, కరోనావైరస్,లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కరోనా కేసులు తగ్గితే తప్ప క్లాసులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా.. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.