National Education Day 2023 : జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11న ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసా ?
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR), సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) వంటి సంస్ధలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మార్గదర్శకత్వంలోనే స్థాపించబడ్డాయి.
National Education Day 2023 : స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆగస్టు 15, 1947 నుండి ఫిబ్రవరి 2, 1958 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫిబ్రవరి 22, 1958న ఢిల్లీలో కన్నుమూశారు.
READ ALSO : Agniveer Vayu Result 2023 : అగ్నివీర్ వాయు రాతపరీక్ష ఫలితాలను డౌన్ లోడ్ చేయటం ఎలాగంటే ?
అబుల్ కలాం గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్-హుస్సేనీ ఆజాద్ నవంబర్ 11, 1888న జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్తగా, పండితునిగా,భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా సేవలందించారు.
ఆయన్ను ముద్దుగా మౌలానా ఆజాద్ అని కూడా పిలుస్తారు. ఒకరకంగా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశానికి కీలకమైన వాస్తుశిల్పిగా ఆయన్ను అభివర్ణిస్తారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) , యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)తో సహా అత్యున్నత విద్యా సంస్థల ఏర్పాటుకు ఆయన ఎంతగానో కృషిచేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – IIT ఖరగ్పూర్ ను స్థాపించారు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR), సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) వంటి సంస్ధలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మార్గదర్శకత్వంలోనే స్థాపించబడ్డాయి.
విద్యారంగంలో ఆయన సేవలు ఎనలేనివి ;
అబుల్ కలాం ఆజాద్ తన జీవితకాలంలో విద్యారంగంలో చేసిన కృషిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివి. స్వాతంత్య్రానంతర భారతదేశంలో, ఆజాద్ గ్రామీణ పేదలు మరియు బాలికలకు విద్య, వయోజన అక్షరాస్యత, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, తప్పనిసరి, సార్వత్రిక ప్రాథమిక విద్య , మాధ్యమిక విద్య , వృత్తిపరమైన శిక్షణ తోసహా వివిధ రంగాలపై అబుల్ కలాం ఆజాద్ ప్రత్యేక దృష్టి సారించారు.
జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని, పాఠశాలలు, కళాశాలల్లో అనేక కార్యక్రమాలు, సెమినార్లు , వర్క్షాప్లను నిర్వహిస్తాయి. వివిధ పాఠశాలల్లో వ్యాసాలు, ప్రసంగాలు, వంటి పోటీలను నిర్వహిస్తాయి.1992లో మౌలానా ఆజాద్కు మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.