పక్కాగా కంటైన్మెంట్ ప్లాన్… తెలంగాణలో సగం జిల్లాలు సేఫ్.. 3 జిల్లాలు కరోనా ఫ్రీ

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారతదేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలను సైతం కలవర పెడుతోంది. తెలంగాణలో కరోనా మహమమ్మారితో కొన్ని జిల్లాలు సతమతం అవుతున్నాయి. కానీ సగానికిపైగా జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉంది. మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 30 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కానీ వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అధికంగా గ్రేటర్ హైదరాబాద్, సూర్యపేట, నిజామాబాద్, వికారాబాద్, గద్వాల జిల్లాలను కరోనా బెంబేలెత్తిస్తోంది. దీంతో ఆ జిల్లాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే మొదట్లో కేసులు నమోదైన కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పరిస్థితి నియంత్రణలోకి వస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ జిల్లాల అధికార యంత్రాంగం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని అంటున్నాయి.
కఠిన చర్యలు తీసుకోకపోవం వల్లే సూర్యపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. తక్కువ కేసులు నమోదు , కొన్ని రోజులుగా నమోదు కాని జిల్లాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాలో మర్కజ్ నుంచి 72 మంది వస్తే కేసుల సంఖ్య 3 మాత్రమే ఉంది. కానీ సూర్యపేట జిల్లాలో 12 మంది మర్కజ్ కు వెళ్లి రాగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరి ద్వారానే 81 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
జగిత్యాల జిల్లాలో తీసుకున్న జాగ్రత్తలు, సూర్యపేటలో తీసుకోలేదని తెలుస్తోంది. కొన్ని జిల్లాల అధికార యంత్రాంగాలు వేగంగా స్పందించకపోవడం, లాక్ డౌన్ పై నిర్లక్ష్యం వల్ల విఫలం అయ్యాయి. కానీ అనేక జిల్లాలు ముఖ్యమంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేశాయి. దీంతో కేసులు ఎక్కువగా ఉన్న కరీంనగర్, మహబూబాబాద్, సిరిసిల్ల, ములుగు, పెద్దపల్లి, ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు నియంత్రణలో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అడపాదడపా కేసులు నమోదవుతున్నా… పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
వనపర్తి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ జిల్లా నుంచి 13 మంది మర్కజ్ కు వెళ్లి రాగా.. వారిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇతర జిల్లాలు, రాష్ట్రం నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేశారు. పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ అనితారామచంద్రన్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. మర్కజ్ అనుమానితులను గుర్తించడం, వారిని ఐసోలేషన్ చేయడం, వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేయడంతో పూర్తి నియంత్రణలో ఉంది. అన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
వరంగల్ రూరల్ జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు. చెక్ పోస్ట్ ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అధికంగా కేసులు నమోదైన ఈ జిల్లాలో ప్రస్తుతం ఒక్కటి కూడా లేకపోవడానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలే ప్రధాన కారణం. మెదక్ జిల్లాలో 15 రోజులుగా కేసులు నమోదు కాలేదు. చివరగా ఏప్రిల్ 8వ తేదీ ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో జిల్లాలో మొత్తం 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురికి నెగెటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వీరిని హోం క్వారంటైన్ లో ఉంచారు. పాజిటివ్ బాధితులతో కాంటాక్ట్ అయిన అందరినీ క్వారంటైన్ లో ఉంచారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడడం, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో వైరస్ వ్యాప్తి జరగలేదు.
జగిత్యాల జిల్లాలో 9 రోజుల కిందట పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన 1,040 మందిని హోం క్వారంటైన్ లో ఉంచారు. మర్కజ్ నుంచి వచ్చిన 72 మందిని ఐసోలేషన్ కు తరలించడంతో పాటు కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 15న పాజిటివ్ గా తేలిన కేసు కూడా గుంటూరు నుంచి వచ్చిన ఐదేళ్ల బాలుడిది కావడం గమనార్హం. వెంట వచ్చిన తాతకు నెగెటివ్ వచ్చింది. ముందుజాగ్రత్త చర్యగా బాలుడి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని ఐసోలేషన్ కు తరలించి, పరీక్షలు నిర్వహించారు. వీరందరికి నెగెటివ్ వచ్చింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రెండు మాత్రమే నమోదు అయ్యాయి. 20 రోజులుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని మొదట్లోనే గుర్తించి హోం క్వారంటైన్ లో ఉంచారు. మర్కజ్ వెళ్లి వచ్చిన 11 మందిని గుర్తించి వారిని పరీక్షించగా, వారిలో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబసభ్యులు, కాంటాక్ట్ అయిన వాళ్లను గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచారు. లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్ల కరోనా కట్టడి చేయగలిగారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఏప్రిల్ 8న చివరి కేసు నమోదైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. జిల్లాలో మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 8 కేసులు మర్కజ్ లింక్ ఉన్నవి కాగా మిగిలినవి వైద్య, ఆరోగ్యశాఖలో పని చేసే ఇద్దరికి, వారిలో ఒకరి తల్లికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు 5 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మర్కజ్ వెళ్లి వచ్చని వారితో పాటు వారితో సన్నిహితంగా ఉన్నవారందరినీ క్వారంటైన్ కు తరలించారు. లాక్ డౌన్ సమర్థవంతంగా అమలు చేయడమే కేసులుపెరగకపోవడానికి కారణం.
నారాయణపేట జిల్లాలో 2 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో ఏప్రిల్ 17న చనిపోయారు. తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అప్రమత్తమైన అధికారులు బాబు తల్లిదండ్రుల, కుటుంబసభ్యులకు సంబంధించిన 14 మందికి నెగెటివ్ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెంలో 30 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అప్పటివరకు నాలుగు కేసులు నమోదు అయ్యాయి. తర్వాత వారికి నెగెటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారిని డిశ్చార్జ్ చేశారు. చత్తీస్ ఘడ్, ఏపీ సరిహద్దులు మూసివేసి, గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో విదేశాల నుంచి 243 మందిని, మర్కజ్ నుంచి వచ్చిన 10 మందిని, వారితో కలిసిన వారిని క్వారంటైన్ లో ఉంచడంతోపాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేశారు. సిద్ధిపేట జిల్లాలో రెండు రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మంత్రి హరీష్ రావు అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి స్వయంగా వెళ్లి లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్నారు. 4 గ్రామాల్లో ప్రజలను ఇంటి నుంచి బయటికి రాకుండా కట్టుదిట్టం చేశారు.
భూపాలపల్లి జిల్లాలో 10 రోజుల నుంచి కొత్త కేసులు నమోదు కాకపోవడం విశేషం. చివరి కేసు ఏప్రిల్ 12న నమోదు అయింది. ఇప్పటివరకు జిల్లాలో మూడు కేసులు నమోదు కావడం గమనార్హం. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా ఆయన భార్య, కూతురుకు సోకింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తిని వెంటనే క్వారంటైన్ చేశారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న 39 మందిని గుర్తించారు. జిల్లా నుంచి ఒకే వ్యక్తి మర్కజ్ కు వెళ్లి రావడం కూడా కేసులు పెరగకపోవడానికి ముఖ్య కారణం. అలాగే చుట్టుపక్కల జిల్లాలైన ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాల నుంచి వచ్చే సరిహద్దులను పూర్తిగా మూసివేయడం కూడా కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 14న హైదరాబాద్ లో ని కింగ్ కోఠి ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమెను పరీక్షించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు వైరస్ ఎలా సోకిందో ఇప్పటికీ మూలం దొరకలేదు. అప్పటివరకు మంచిర్యాలలో ఒక్క కేసుల కూడా నమోదు కాలేదు. జిల్లా యంత్రాంగం మహారాష్ట్ర నుంచి వచ్చే సరిహద్దుల్లో నిత్యం నిఘా ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.