నష్టపోయిన వ్యాపారులను ఆదుకోవాలి : రాజాసింగ్

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ సొసైటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వాస్తవమని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. జనవరి 30వ తేదీ బుధవారం నాడు ఎగ్జిబిషన్లో జరిగిన ప్రమాదంలో 500 షాపులు ఖాళీపోయాయని తెలిపారు. జనవరి 31వ తేదీన ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫీసు వద్ద నష్టపోయిన వ్యాపారస్తులు ఆందోళన చేపట్టారు. వీరితో మాట్లాడడానికి ఆయన వచ్చారు.
ఈ సందర్భంగా రాజాసింగ్తో టెన్ టివి ముచ్చటించింది. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చి బిజినెస్ చేస్తున్నారని..కానీ అగ్నిప్రమాదం వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం నుండి ఒక ప్రతినిధిని పంపించి..వారితో చర్చించాలని సూచించారు. ఎగ్జిబిషన్లో 2500 షాపులు ఏర్పాటు చేస్తే..ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోరా ? అని ప్రశ్నించారు. ఎలాంటి ప్లాన్ చేయకుండా కేవలం రెంట్ కోసమే వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా సొసైటీకి సంబంధించిన వారు కనిపించడం లేదని తెలిపారు. సొసైటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయనే మాటల్లో వాస్తవం ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు.