మెట్రో సరికొత్త రికార్డు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ విధులకు హాజరు కావడం లేదు. దీంతో కొందరు ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నిర్వహిస్తున్నారు.
సరిపడ బస్సులు లేకపోవడంతో జనాలు ఎక్కువగా మెట్రోని ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రికార్డులు సృష్టిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో సరికొత్త చరిత్ర లిఖించింది. సోమవారం (అక్టోబర్ 14, 2019) ఒక్కరోజే వివిధ రూట్లలో మూడు లక్షల 80వేల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. హైదరాబాద్లో మెట్రో ప్రారంభమైన తర్వాత ఇది సరికొత్త రికార్డని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు సుమారు 3 లక్షల 65వేల మంది ప్రయాణించడం రికార్డుకాగా, దానిని నిన్న అధిగమించినట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రోరైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్లను రోజుకు 810 ట్రిప్పులు నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.