మంత్రి శంకర్..256 నేరాలు..32 సార్లు జైలుశిక్ష..మారని బుద్ధి..క్రిమినల్ రికార్డులు మామూలుగా లేవుగా..

Hyderabad : most wanted burglar mantri shankar criminal record : మంత్రి శంకర్..వయస్సు 60 ఏళ్లు. పేరుకే మంత్రి. కరడు కట్టిన ఘరానా దొంగ. ఎన్నిసార్లు పోలీసులకు చిక్కి జైలుకెళ్లి వచ్చినా మారని కుక్కబుద్ది. జల్సా పురుషుడు. మంత్రి శంకర్ చేసిన చోరీలకు లెక్కేలేదు. దాదాపు నలభై ఏళ్లుగా అన్ని పోలీసు స్టేషన్లకు మంత్రి శంకర్ పేరు సుపరిచితమే. ఘరానా చోరీల్లో ఆరితేరిన తస్కర యోధవృద్ధుడు..చోరకళా తపస్వి. ఇలా ఇతగాడికి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే.
మంత్రి శంకర్ 256 కేసుల్లో నిందితుడు..32 సార్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఘరానా ఖైదీ. నాలుగుసార్లు పీడీ యాక్ట్..ఇలా మంత్రి శంకర్ అలియాస్ శివన్న ట్రాక్ రికార్డు. ఇన్నిసార్లు జైలుకెళ్లినా అతగాడి దొంగబుద్ధి ఏమాత్రం మారలేదు. ఇతగాడు మంచి జల్సా పురుషుడు కూడా. ముగ్గురు భార్యలు ఉన్నారు. వాళ్లు చాలరన్నట్లుగా మరో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు.
మంత్రి శంకర్ ఇరవై ఏళ్ల వయసులోనే దొంగతనాలు ప్రారంభించాడు. 60 ఏళ్లు వచ్చినా చోరీలు మానలేదు. పోలీసులు పట్టుకోవటం జైలుకు పంపించటం మానలేదు. అయినా బుద్ధి మార్చుకోలేక మరోసారి పోలీసుల చేతికి మళ్లీ చిక్కాడు. హైదరాబాద్ నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శంకర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.12.09 లక్షల నగదు, వెయ్యి గ్రాముల వెండి, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శుక్రవారం (డిసెంబర్ 25,2020)న నగర సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో మంత్రి శంకర్ నేరాల చిట్టా గురించి తెలిపారు.
ఈసారి ఆరు నేరాల్లో నిందితుడిగా ఉన్న మంత్రి శంకర్తో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురినీ కూడా అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. బోయిన్పల్లి, బేగంపేట, మారేడ్పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్శిటీ ఠాణాల పరిధిల్లో ఒంటరిగానే చోరీలు చేసే మంత్రి శంకర్ వయసు మీదపడుతుండటంతో గత రెండేళ్లుగా ముఠాలను కట్టి మరీ వారితో చోరీలు చేయిస్తున్నాడు.
మూడిళ్లలో ఒకేసారి చోరీ
గతంలో ఓ కేసులో జైలుకెళ్లిన మంత్రి శంకర్ ఈనెల 4న జైలు నుంచి బయటకొచ్చాడు. అనంతరం తన పని ప్రారంభించాడు. ఫలక్నుమాకు చెందిన అబ్దుల్ లతీఫ్ ఖాన్, భవానీనగర్ వాసి మహ్మద్ మజీద్, నల్లకుంట వాసి మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్లతో కలసి మంత్రి శంకర్ ముఠాలతో జట్టుకట్టాడు. నల్లకుంట, కుషాయిగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీగా చోరీలు చేశాడు. డిసెంబర్ 11వ తేదీ రాత్రి బేగంపేటలో వరుసగా ఐదు ఇళ్ళ తాళాలు పగులకొట్టి మూడు ఇళ్ళల్లో బంగారం, నగదు దోచుకుపోయారు.
బేగంపేటలో నమోదైన కేసులపై దర్యాప్తు నేపథ్యంలో రంగంలోకి దిగిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్సైలు జి.రాజశేఖర్రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్లు మంత్రి శంకర్ తోపాటు అతడికి సహకరించిన ముగ్గురినీ మహారాష్ట్రలో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షల నగదుతో పాటు బంగారం, వాహనాలు, చోరీకి వాడే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
40ఏళ్లుగా చోరీలు..256 నేరాలు..32 సార్లు జైలుశిక్ష
సికింద్రాబాద్లోని చిలకలగూడకు చెందిన మంత్రి శంకర్ అప్పట్లో తన తల్లితో తరచూ గొడవపడుతున్న వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన శంకర్ 1979 డిసెంబర్లో తొలిసారిగా ఓ చోరీ చేసి దొంగగా మారాడు. ఈ కేసులో ఆ తర్వాత చోరీ సొత్తు ఖరీదు చేసే రిసీవర్గా మారాడు. ఈ నేరం కింద పోలీసులకు చిక్కడంతో రిమాండ్ నిమిత్తం అప్పటి ముషీరాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్ళాడు. అక్కడే శంకర్కు నాటి ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధికి చెందిన దొంగలు నాగిరెడ్డి, బల్వీందర్ సింగ్, దీపక్ సక్సేనా, నాగులు వద్ద తాళం ఎలా పగులకొట్టాలో బాగా నేర్చుకున్నాడు. అక్కడే జైలులోని వంటగది తాళం పగులకొట్టించి చోరీ చేయిస్తూ వంట సామాను బయటకు తెప్పించి ఇష్టమైంది వండుకుని తినేవారు.
తాళాలు పగులగొట్టటంలో శంకర్ స్పెషలిస్ట్..10 సెకన్లలో ఇల్లు లూటీ
దొంగతనం చేయాలంటే పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగటం శంకర్ స్టైల్. ఖరీదైన డ్రెస్సులు వేసుకుని..టక్ షూష్ తో పెద్ద ధనవంతుడిలా కార్లలో తిరగుతూ డేగకళ్లతో రెక్కీలు చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇల్లు రోడ్డు మీదికి కనిపిస్తే చాలు చక్కగా చోరీకి రెడీ అయిపోతాడు. చోరీ చేసే ఇంటికి దూరంగా వెహికల్ ఆపి..ఆపి దర్జాగా వెళ్ళి ‘పని’ కానిచ్చేసి చక్కగా వచ్చేస్తాడు. చోరీకి వెళ్లేటప్పుడు చేతిలో చిన్న రాడ్డు, స్క్రూ డ్రైవర్లను ఉంటే చాలు ఎలాంటి తాళమైనా సరే శంకర్ చేతిలోకి ఊడి రావాల్సిందే. ఎటువంటి స్ట్రాంగ్ తాళం అయినా సరే..ఓన్లీ 10 సెకండ్స్ లో పగులగొట్టేస్తాడు. అర్ధరాత్రి దొంగతనం చేసి ఆ ఇంటి మిద్దె మీద తెల్లవారే వరకు కూర్చుని..మార్నింగ్ వాకర్స్ హడావుడి మొదలైనప్పుడు వారితో కలసిపోయి చక్కగా వచ్చేస్తాడు.
ముగ్గురు భార్యలు..మరో ముగ్గురితో సహజీవనం
ఇతడు పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వరుసగా మూడు రోజుల పాటు ఏ ఒక్క ప్రాంతంలోనూ ఉండకుండా మకాం మారుస్తూ ఉండటం శంకర్ ముందు జాగ్రత్త చర్యలో భాగం. చోరీల ద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే ఇతగాడికి ఆడవాళ్ల పిచ్చి బాగా ఎక్కువ. వ్యభిచారం గృహాల్లో జల్సాలు చేస్తుంటాడు. వేసుకునే డ్రెస్ నుంచి టాప్ టూ బాటమ్ప్రతీదీ బ్రాండెడ్ వే వాడతాడు. ఇతగాడి ఆడాళ్ల పిచ్చితో ముగ్గురు భార్యలున్నారు. వాళ్లు సరిపోరన్నట్లు మరో ఆరుగురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. మంత్రి శంకర్ కు ఆరుగురు పిల్లలున్నారు.
శంకర్ కన్ను పండిందంటే ఇల్లు లూటీ అవ్వాల్సిందే..60ఏళ్లలో 41 ఏళ్లు చోరీలే
60 ఏండ్ల వయస్సులో చలాకీతనం.. 41 ఏండ్లుగా దొంగతనాలు.. కన్ను పడ్డ ఇంటిని 10 సెకెండ్లలో లూటీ చేసే నేర్పరి తనం.. ఇది తాజా గా మరోసారి పట్టుబడ్డ మంత్రి శంకర్ దొంగతనాల తీరు… నాలుగు దశాబ్దాలుగా నిరంతరంగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతూ వస్తున్నాడు. 1979 నుంచి వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నా.. తన దొంగతనాలు మాత్రం మానడు.
జైలు నుంచి బయటకు రాగానే ఒక్కోసారి ఒక్కో ముఠా.. తన భార్యల సహకారంతో దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. 40 ఏండ్ల జీవిత కాలం లో జైల్లోనే తన జీవితాన్ని ఎక్కువగా గడిపాడు.. బెయిల్పై బయటకు వచ్చాడంటే.. తిరిగి తన చేతికి పనిచెబుతూ ఉంటాడు.