ఇక తహసీల్దార్లు కూడా అవినీతికి పాల్పడే అవకాశమే లేదు, 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు

కొత్త రెవెన్యూ బిల్లుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతికి ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) శాసనమండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు వీఆర్వోలకు అనవసర అధికారాలు ఇవ్వడంతో అరాచకాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ క్రమంలో వీఆర్వోలను రద్దు చేసి కఠిన నిర్ణయాలను తీసుకున్నామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఇకపై తహసీల్దార్లు కూడా అవినీతికి పాల్పడే అవకాశమే లేదని కేసీఆర్ చెప్పారు.
ధరణి పోర్టల్లో మార్పులకు తహసీల్దార్కు అవకాశం లేదన్నారు. సబ్ రిజిస్ర్టార్లకు ఎలాంటి విచక్షణా అధికారం లేదన్నారు. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్లో అప్డేట్ కాగానే సంబంధిత కాపీలు వస్తాయన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్ కాపీలు వెంటనే వస్తాయన్నారు. బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫోటోతో రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు.
ఈ వివరాలన్నీ లేకుండా తహసీల్దార్లకు పోర్టల్ తెరుచుకోదన్నారు. పకడ్బందీ వ్యూహంతో పేద రైతుల హక్కులు కాపాడుతామన్నారు. రైతులు, ప్రజలకు లంచాలు ఇచ్చే బాధ తప్పాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. రెవెన్యూ కోర్టులు రద్దు చేశామని తెలిపారు. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. కావాలని వివాదాలకు వెళ్లే వారి విషయంలో ప్రభుత్వం సమయం వృథా చేయదని సీఎం స్పష్టం చేశారు.
https://10tv.in/trs-govt-will-not-consider-tenant-system-of-farmers-in-telangana-govt/
భూస్వాములు, జాగీర్దార్లు లేరు : సీఎం కేసీఆర్
తెలంగాణలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు లేరని కేసీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు బయట అవాకులు చెవాకులు పేలుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ బిల్లు వల్ల భూస్వాములకు లాభం జరుగుతుందని అంటున్నారు, కానీ తెలంగాణలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు లేరని సీఎం తేల్చి చెప్పారు. ఇది కఠోర సత్యమని అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 60లక్షల 95వేల 134 మంది పట్టాదారులు ఉన్నారని చెప్పారు. 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులు 39లక్షల 52వేల 232 మంది ఉన్నారని తెలిపారు. 2.5 నుంచి 3 ఎకరాల్లోపు ఉన్న రైతులు 4లక్షల 70వేల 759 మంది, 3 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 11లక్షల 08వేల 193 మంది, 5 నుంచి 7.5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 3లక్షల 49వేల 382 మంది, 7.5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు లక్షా 15వేల 916 మంది, 25 వేల ఎకరాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు.
కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. వీఆర్వో పోస్టులకు ప్రాధాన్యం లేదన్నారు. భూమి శిస్తు రద్దు చేశామని, ఇక వీఆర్వోలతో పని లేదన్నారు. భూవివాదాల్లో వీఆర్వోలు పాత్రధారులుగా ఉన్నారని, కోట్ల రూపాయలు చేతులు మారాయని కేసీఆర్ అన్నారు. వీఆర్వోలకు అనవసర అధికారాలు ఇచ్చారని చెప్పారు.