తెలంగాణ లో మూడు MLC స్థానాలకు నోటిఫికేషన్

తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాట్లు పూర్తిచేసింది. 40 స్థానాలున్న శాసనమండలిలో మార్చి చివరికల్లా 16 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. దీనిని పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది. శాసనమండలిలో ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎమ్మెల్యే కోటా కింద 7, స్థానిక సంస్థల కోటాలో 5, ఉపాధ్యాయ కోటాలో 2 స్థానాలు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గం కింద 1, గవర్నర్ కోటాలో మరొకటి ఉంది.
ప్రస్తుతానికి రెండు ఉపాధ్యాయ MLC స్థానాలకు, ఒక పట్టభద్రుల నియోజవర్గానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టు CEO రజత్కుమార్ తెలిపారు. మార్చి నెలాఖరుకు పదవీకాలం ముగిసే ఉపాధ్యాయ నియోజకవర్గాలైన మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గం, అలాగే పట్టభద్రుల నియోజకవర్గం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంగనగర్ స్థానాల ఎన్నికలకు కసరత్తు పూర్తిచేసినట్లు ఈసీ కి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.