ఈవెంట్ నిర్వాహకులకు తాజా మార్గదర్శకాలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఎగ్జిబిషన్ లు, ఇతర ప్రదర్శనలు నిర్వహించేవారికి ప్రభుత్వం కొత్త మార్గదర్శాకాలను రూపోందిస్తోంది . ఇక నుంచి ఎవరు పడితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పబ్లిక్ ఈవెంట్స్ ను నిర్వహించటానికి వీలు లేదు. ఇందుకు సంబందించి చిన్న, మధ్య తరహా , ప్రధాన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను రూపోందించాలని చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్వాహకులు వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అవసరమైన అనుమతులను పొందేందుకు, నిబంధనలకు కచ్చితంగా అమలు చేసేందుకు కట్టుబడి ఉండేలా ఒక ప్రోఫార్మా రూపోందించాలని కూడా ఆయన ఆదేశించారు. కార్యక్రమాల నిర్వాహకులు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే కార్యక్రమాలు నిర్వహిస్తామని అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ఏడాది నాంపల్లి ఏగ్జిబిషన్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనలు తయారు చేస్తోంది. సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాతే నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకునేలా నిబంధనలు రూపోందిస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల నుండి అవసరమైన అనుమతులను పొందేందుకు నుమాయిష్, చేప ప్రసాదం పంపిణీ వంటి ఏడాదికొకసారి జరిగే కార్యక్రమాల కోసం ప్రత్యేక నింబంధనలు రూపోందిస్తున్నారు. నిర్వాహకులు పార్కింగ్ సదుపాయాలతో సహా ఈవెంట్ వేదిక లేఅవుట్ ను ముందుగానే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయనుంది.