చైనాను మించి : అమెరికాలో 4వేలు దాటిన కరోనా మరణాలు…ఒక్కరోజే 865మంది మృతి

అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ అగ్రరాజ్యంలో కరోనా… భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ఇద్దరు భారతీయులు కూడా కరోనా కాటుకు బలయ్యారు. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.న్యూయార్క్‌ లో 75,983 కేసులు నమోదు అవగా,న్యూజెర్సీలో 18,696 కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రాలకు వెళ్లకూడదంటూ అధికార వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 865 కరోనా మరణాలు నమోదయ్యాయని మేరీల్యాండ్ లోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది.

కాగా ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 1లక్షా 88వేల 578 ఉండగా,4వేల 55 మరణాలు నమోదయ్యాయి. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కన్నా మరణాల సంఖ్యలో,కేసుల సంఖ్యలో అమెరికానే ముందుంది. అయితే గత శనివారం 2010 కరోనా మరణాలు నమోదవగా,రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ అయింది. కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తొంది.

రాబోయే రెండు వారాలు తీవ్రమైన బాధను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్లేగు వంటిది. ప్రతీ అమెరికా పౌరుడు కరోనా, దాని వల్ల ఎదురయ్యే కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం అన్నారు.

అమెరికా కరోనాతో పూర్తిస్థాయిలో పోరాడుతోందని… అయితే మహమ్మారి ధాటికి 2,40,000 అమెరికన్లు మృత్యువాత పడే అవకాశం ఉందని వైట్ హౌస్ హెచ్చరించింది. కరోనాను కట్టడి చేసేందుకు మ్యాజిక్‌ వ్యాక్సిన్‌ గానీ.. చికిత్స గానీ లేదని… మనుషుల ప్రవర్తన, క్రమశిక్షణ మీదే కరోనా వ్యాప్తి ఆధారపడి ఉంటుందని తెలిపింది. కాబట్టి ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 50వేలకి చేరగా,42 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.