నమ్మలేని నిజాలు వూహన్ డైరీలో…. రచయితకు బెదిరింపులు
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే ఆగిపోయింది. శతాబ్ధకాలంగా ఎప్పుడూ ప్రపంచం ఎదుర్కోని పరిస్థితులు ఎదుర్కొంటుంది మానవాళి. ఇదిలా ఉంటే.. చైనాకు చెందిన ప్రముఖ రచయిత్రి, చైనా సాహిత్య అవార్డు గ్రహీత ఫాంగ్ ఫాంగ్ వుహాన్లో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఓ డైరీ రాయడం మొదలుపెట్టారు. ఇందులో అనేక విషయాల గురించి ఆమె ప్రస్తావించారు.
కరోనా వైరస్ పుట్టుక, మరణాలు, వైరస్ కారణంగా వుహాన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆమె డైరీలో రాశారు. రోగులకు తగినన్ని హాస్పిటల్స్ లేకపోవడంతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యారని, దీని కారణంగా చాలామంది మరణించినట్టు ఆమె తన డైరీలో వెల్లడించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుందని డాక్టర్లు ప్రభుత్వాలను ముందే హెచ్చరించినా, అధికారులు ప్రజలను హెచ్చరించలేదంటూ ఆమె తన డైరీలో రాసుకొచ్చారు.
మేధావుల కుటుంబంలో జన్మించిన రచయిత అసలు పేరు వాంగ్ ఫాంగ్, కానీ ఆమె ఫాంగ్ ఫాంగ్ అనే కలం పేరుతో పాపులర్ అయ్యింది. స్వతంత్ర మీడియా లేని కమ్యూనిస్ట్ పాలిత దేశమైన చైనాలో ఆమె రాసిన వుహాన్ డైరీని ఆన్లైన్లో లక్షల మంది చదువుతున్నారు. అయితే ఆమె డైరీ రాసిన తర్వాత ఆమె బెదిరింపులు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ డైరీని కొలిన్ హర్పర్స్ అనే సంస్థ అనేక భాషల్లో ముద్రించాలని సిద్ధం అయ్యింది. చైనా ప్రభుత్వం కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే అమెరికా ఇప్పటికే చైనాపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.