పాక్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ

భారత వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను పాకిస్తాన్..కరాచీలోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్(PAF)మ్యూజియంలో పెట్టుకున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టు అన్వర్ లోధి శనివారం అర్ధరాత్రి తన ట్విటర్ ద్వారా కరాచీ మ్యూజియంలోని అభినందన్ బొమ్మ ఫొటోను షేర్ చేశారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో పాక్ అభినందన్ బొమ్మ పెట్టడం గమనార్హం. అయితే బొమ్మను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో అన్వర్ తెలుపలేదు. అంతేకాక, అభినందన్ బొమ్మ చేతిలో టీ కప్పు పెడితే ఇంకా బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రశిబిరాలపై మెరుపు దాడులు చేసిన విషయం తెలసిందే. బాలాకోట్ వైమానిక దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో పట్టుబడిన అభినందన్ వర్థమాన్ ను భారత్ సహా,ప్రపంచ దేశాల ఒత్తిడితో క్షేమంగా భారత్ కు అప్పగించింది. పలు పరీక్షల అనంతరం ఇటీవల తిరిగి వాయుసేనలో అభినందన్ చేరారు.