Modi Speaks Putin : తక్షణమే హింసకు స్వస్తి పలకండి.. పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్
యుక్రెయిన్పై సైనిక దాడికి తక్షణమే స్వస్తి పలకాలని పుతిన్ ను కోరారు. హింసకు తెర దించాలని పుతిన్ ను అభ్యర్థించారు ప్రధాని మోదీ. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని..

Modi Putin
Modi Speaks Putin : రష్యా-యుక్రెయిన్ సంక్షోభంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో గురువారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. యుక్రెయిన్పై సైనిక దాడికి తక్షణమే స్వస్తి పలకాలని పుతిన్ ను కోరారు. హింసకు తెర దించాలని పుతిన్ ను అభ్యర్థించారు ప్రధాని మోదీ. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని పుతిన్కు సూచించారు. అదే విధంగా యుద్ధం కారణంగా యుక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
కాగా, తొలి నుంచి భారత్కు రష్యా మిత్రదేశంగా ఉంది. రష్యాతో భారత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్షణం యుద్ధాన్ని నిలిపేయాలని పుతిన్ను ప్రధాని నరేంద్రమోదీ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ అభ్యర్థనకు పుతిన్ ఓకే చెబుతారా? యుద్ధం ఆపేస్తారా? ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి? అని ప్రపంచ దేశాలు ఆత్రుతగా వేచి చూస్తున్నాయి.
Ukraine Ambassador : మోదీ శక్తిమంతుడు.. ఆయనొక్కడే పుతిన్ను ఆపగలడు : యుక్రెయిన్ రాయబారి
మిలటరీ ఆపరేషన్ పేరుతో గురువారం ఉదయం యుక్రెయిన్ పై దాడికి దిగింది రష్యా. యుక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది రష్యా సైన్యం. 70కి పైగా యుక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. రష్యా బలగాల బాంబుల దాడితో యుక్రెయిన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

PM Modi speaks to Putin, urges immediate end to violence between Russia and Ukraine
కాగా, యుక్రెయిన్పై రష్యా దాడిని అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. బ్రిటన్, జర్మనీ దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాల కూటమి నాటో కూడా రష్యా చర్యను తప్పుబట్టింది. మరోవైపు రష్యా-యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు, సహజ వాయువు, బంగారం ధరలు అమాంతం పెరిగాయి.
యుక్రెయిన్పై రష్యా మరణాహోమాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖా.. ప్రధాని మోదీని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. మోదీ శక్తిమంతుడు.. కేవలం మోదీ మాత్రమే పుతిన్ ను ఆపగలరని ఆయన అన్నారు.
మరోవైపు.. శుక్రవారం (ఫిబ్రవరి 25)న నాటో దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. యుక్రెయిన్ పై రష్యా దాడులను నాటో తీవ్రంగా ఖండించింది. యుక్రెయిన్ను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. యుక్రెయిన్ ప్రజలు, ప్రభుత్వానికి అండగా ఉంటామని నాటో సెక్రటరీ జనరల్ తెలిపారు. యుక్రెయిన్ పై రష్యా వెంటనే దాడులు ఆపేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో హెచ్చరించింది.