విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ళలోనే ఉండండి : కేంద్రం ఆదేశాలు

భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలురాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఇండియా వచ్చిన వారెవ్వరైనా సరే కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ హోం ఐసోలేషన్ లోనే ఉండాలని స్పష్టం చేసింది. హోం ఐసోలేషన్ లో ఉండే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపింది.
> ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ లక్షణా లు లేకపోయినా ఇంట్లో గాలి వెలుతురు ఉన్న గదిలో ఐసోలేషన్(ఒంటరిగా) ఉండాలి. ఈ విషయంలో కుటుంబసభ్యులు వారికి సహకరించాలి.
> వారికి సాయంగా కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిని కేటాయించాలి
> ఇతర కుటుంబ సభ్యులు వేరే గదిలో ఉండాలి. అది సాధ్యం కాకపోతే, ఆ వ్యక్తికి కనీసం ఒక మీటర్ దూరంలో ఉండాలి
> బాధితుడు ముఖానికి సురక్షితమైన మెడికల్ మాస్క్ ధరించాలి.
> మాస్క్లు తడిగా లేదా మురికిగా ఉంటే వెంటనే మార్చాలి
> ఆరు గంటలు ఉపయోగించిన తర్వాత మాస్క్ను తీసేయాలి. దాన్ని తొలగించిన తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కోవాలి
> ఇంట్లోవారు కూడా ఏదైనా పనిచేశాక చేతిని సబ్బుతో కడుక్కోవాలి. అందుబాటులో ఉంటే టిష్యూ పేపర్లను వాడాలి.
> క్లినికల్ పరీక్షలో వారికి లక్షణాలు లేవని నిర్ధారించే వరకు ఆ వ్యక్తులు ఇంట్లోనే ఉండాలి
> బెడ్లను, ఇతర ఫర్నీచర్ను, బాత్రూమ్లను తరచూ తాకినప్పుడు వాటిని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి
> బాధితుడిని 14 రోజులపాటు ఈ జాగ్రత్తలు పాటించాలని కోరాలి
> అతనికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్య వస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి
> ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్లకు ఫోన్ చేసి వివరాలు చెప్పాలి.