అదుర్స్ : కొత్త జెర్సీలో  టీమిండియా

  • Publish Date - March 2, 2019 / 04:07 AM IST

హైదరాబాద్:  భారత క్రికెట్‌ జట్టు సభ్యులు ధరించే  కొత్త జెర్సీ ని శుక్రవారం  హైదరాబాద్ లో ఆవిష్కరించారు. జట్టు అపెరల్‌ పార్ట్‌నర్‌ ‘నైకీ’ వచ్చే సీజన్‌ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్త  జెర్సీ ధరించిన  క్రికెటర్లు తళుక్కున మెరిశారు. ఇంగ్లండ్ వేదికగా మూడు నెలల్లో మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నీ కోసం ప్రత్యేకంగా ఈ జెర్సీలు డిజైన్ చేశారు. జెర్సీ  ఆవిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ కోహ్లీతో పాటు ధోనీ, రహానే, పృథ్వీషా, మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు. 
Read Also : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, భార‌త్‌ ఫీల్డింగ్‌

నేటినుంచి జరిగే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు. గతంలో లాగే రీసైకిల్డ్‌ మెటీరియల్‌తో ‘నైకీ’ దీనిని తయారు చేసింది. కొత్త జెర్సీలో రెండు రకాల బ్లూ షేడ్స్‌ ఉన్నాయి. గత జెర్సీతో పోలిస్తే ఒక ప్రధానమైన మార్పు కొత్తదాంట్లో కనిపించింది. మూడు ప్రపంచకప్‌ల గెలుపునకు సంకేతంగా ఇప్పటి వరకు ఎదపై కనిపించిన మూడు ‘స్టార్లు’ ఇకపై కాలర్‌ లోపలి వైపు కనిపిస్తాయి.  కాలర్ వెనుక నారింజ రంగు షేడ్ ఇచ్చారు. చాతి పైన కుడివైపు నైకీ సింబల్, ఎడమవైపు బీసీసీఐ లోగో ఉంది. ప్రధాన స్పాన్సర్ ఒప్పో ఇండియా అని పెద్ద అక్షరాల్లో కనిపిస్తున్నది. పైగా తొలిసారి ఆ మూడు వరల్డ్‌ కప్‌ విజయాల (1983, 2007, 2011) తేదీలు, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ చేసిన స్కోర్లు దానిపై ముద్రించారు. అంతే కాకుండా ఆ మూడు ఫైనల్స్‌ వేదికలు లార్డ్స్, వాండరర్స్, వాంఖడే మైదానాల అక్షాంశాలు–రేఖాంశాలు కూడా దీనిపై ముద్రించడం మరో విశేషం. 
Read Also : ఉప్పల్ మ్యాచ్ వారికి కీలకం.. పుష్కరకాలం కోరిక కోహ్లీ సేన తీర్చేనా?

గత ప్రపంచకప్ టోర్నీలకు భిన్నంగా తయారు చేసిన కొత్త జెర్సీని ధరించిన క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. “జెర్సీని భవిష్యత్ తరాలకు అందించడం గర్వంగా అనిపిస్తున్నది. 1983లో కపిల్‌దేవ్ తొలిసారి భారత్‌కు ప్రపంచకప్ అందించినప్పుడు మేమంతా చాలా చిన్నవాళ్లం. వాళ్లను ఆదర్శంగా తీసుకుంటూ ఈ స్థాయికి ఎదిగాం. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్..ప్రతి సందర్భం అద్భుతం. జెర్సీ ధరించి జాతీయ జట్టుకు ఆడటమనేది ప్రతి ఒక్కరి కల. గత ప్రపంచకప్‌ల లాగానే..2019 టోర్నీ చిరస్మరణీయంగా నిలువాలని కోరుకుంటున్నా” అని ధోనీ అన్నాడు.
Read Also : తప్పుడు రాతలు ఆపండి.. పాక్ మీడియా కథనంపై పవన్ కళ్యాణ్