Ferry Fire: నడి సముద్రంలో ఘోర ప్రమాదం.. మంటల్లో ఫెర్రీ.. అందులో 280 మంది ప్రయాణికులు.. పిల్లలతో కలిసి దూకేశారు..

ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేశారు. మంటల నుంచి తప్పించుకోవడానికి కొందరు తమ పిల్లలతో కలిసి సముద్రంలోకి దూకేశారు.

Ferry Fire: నడి సముద్రంలో ఘోర ప్రమాదం.. మంటల్లో ఫెర్రీ.. అందులో 280 మంది ప్రయాణికులు.. పిల్లలతో కలిసి దూకేశారు..

Updated On : July 20, 2025 / 10:31 PM IST

Ferry Fire: ఇండోనేషియా తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. 280 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ (పడవ)లో మంటలు చెలరేగాయి. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు సముద్రంలోకి దూకేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో గర్భిణి ఉంది.

ద బార్సిలోనా 5 (కేఎం) ఫెర్రీ.. ఇండోనేషియాలోని తలౌడ్‌ నుంచి మనాడో సిటీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేశారు. మంటల నుంచి తప్పించుకోవడానికి కొందరు తమ పిల్లలతో కలిసి సముద్రంలోకి దూకేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సముద్రంలోకి దూకినా.. సేఫ్టీ జాకెట్లు ఉండటంతో చాలా మంది బతికి బయటపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే.. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రయాణికులు, సిబ్బంది సహా 150 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. 130 మంది జాడ తెలియడం లేదు. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, జాడ తెలియకుండా పోయిన ప్రయాణికుల కోసం గాలిస్తున్నామని అధికారులు చెప్పారు. కాగా, ఫెర్రీలో అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఫెర్రీ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అటు ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దిగువ డెక్‌ల నుండి దట్టమైన నల్లటి పొగ రావడం, మంటలు చెలరేగం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రయాణికులు భయాందోళనకు గురై సముద్రంలోకి దూకడం ప్రారంభించారు. కాపాడండి అంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. ప్రయాణికులతో డెక్ కిక్కిరిసిపోయి ఉంది. ఓడ సిబ్బంది వెంటనే వారికి లైఫ్ జాకెట్లు పంపిణీ చేశారు. వాటి సాయంతో కొంతమంది నీటిలోకి దూకేశారు.

అబ్దుల్ రహమద్ అగు అనే ప్రయాణీకుడు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడు. నీటిలో ఉన్న అతడి చేతిలో ఏడుస్తున్న పిల్లాడు ఉన్నాడు. అలాగే నీటిలో నిలబడి వీడియో తీశాడు. “మాకు సాయం చేయండి, KM బార్సిలోనా ఫెర్రీ మంటల్లో చిక్కుకుంది. అందులో చాలామంది ఉన్నారు. మేము సముద్రంలో కాలిపోతున్నాము, మాకు త్వరగా సాయం కావాలి” అని అతడు వేడుకోవడం ఆ వీడియోలో ఉంది.

సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా నావికాదళం వెంటనే మూడు నౌకలను సహాయక చర్యలను ప్రారంభించడానికి పంపింది. స్థానిక మత్స్యకారులు కూడా సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు. తాజా నివేదికల ప్రకారం దాదాపు 150 మందిని రక్షించారు. 130 మంది జాడ లేకుండా పోయారు.

ఫెర్రీలో మంటలకు కారణం ఇంకా తెలియలేదు. మూడవ డెక్‌లో మంటలు ప్రారంభమై త్వరగా ఫెర్రీ అంతటా వ్యాపించినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం.. ఇండోనేషియాలోని ఫెర్రీస్ లో ప్రయాణికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని తెలుపుతుంది.