Kabul Airport: కాబూల్ ఎయిర్‌పోర్ట్ క్లోజ్.. సరిహద్దుల్లో బారులు తీరిన అఫ్ఘాన్లు

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబూల్‌ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకొని మూసేశారు. పాశ్చాత్య దేశాలు తమ పౌరులు, సైనికుల తరలించే ప్రక్రియలో...

Kabul Airport: కాబూల్ ఎయిర్‌పోర్ట్ క్లోజ్.. సరిహద్దుల్లో బారులు తీరిన అఫ్ఘాన్లు

Kabul Airport

Updated On : September 2, 2021 / 10:31 AM IST

Kabul Airport: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబూల్‌ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకొని మూసేశారు. పాశ్చాత్య దేశాలు తమ పౌరులు, సైనికుల తరలించే ప్రక్రియలో విమానాశ్రయాన్ని నాశనం చేశారని.. మరమ్మతుల అనంతరం పునరుద్ధరిస్తామంటూ తాలిబాన్ల సీనియర్‌ నేత అనాస్‌ హక్కానీ బుధవారం వెల్లడించారు.

కాబూల్‌ ఎయిర్‌పోర్ట్ల్ నుంచి అతి త్వరలోనే రాకపోకలు ప్రారంభిస్తామని తెలిపారు. చేసేది లేక అఫ్ఘాన్‌ను వీడాలనుకుంటున్న వారు సరిహద్దుల బాట పట్టారు. దేశ సరిహద్దుల వద్ద, దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలు పెద్దసంఖ్యలో బారులు తీరారు.

తాలిబాన్ల సుప్రీం కమాండర్‌ హయబతుల్లా అఖుంద్జాదా నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గ్రూపు సాంస్కృతిక కమిషన్‌ సభ్యుడు బిలాల్‌ కరీమీ తెలిపారు. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలకు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని చెప్పారు. పంజ్‌షీర్‌ నేతలతో తాలిబాన్లు జరిపిన చర్చలు విఫలమైనట్లు సీనియర్‌ తాలిబాన్‌ నేత అమీర్‌ ఖాన్‌ ముత్తాకీ చెప్పారు.

పంజ్‌షీర్‌లో మిలీషియా సేనలకు, తాలిబాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 34 మంది తాలిబాన్లు హతమయ్యారంటూ వార్తా సంస్థలు వెల్లడించాయి. మారణకాండను ఆపేందుకు అఫ్ఘానిస్థాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి సమర్థించుకున్నారు. అమెరికా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు అఫ్ఘాన్‌లో బలగాలను కొనసాగించడంతో అర్థం లేదని చెప్పుకొచ్చారు. ఐఎస్ ఉగ్రవాదులకు ‘మీపై మా పోరు ఇంకా ముగియలేదు’ అంటూ హెచ్చరికలు జారీచేశారు.

భారీ మూల్యమే:
అఫ్ఘాన్‌లో అమెరికా శకం ముగిసింది. 20 ఏళ్లలో అఫ్ఘాన్‌ కొంత అభివృద్ధి చెందినా, అక్కడి పరిస్థితులు మాత్రం అమెరికాకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చాయి. భారీగా అప్పులు పాలైనట్లు బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కాస్ట్స్‌ ఆఫ్‌ వార్‌ పేరిట రూపొందించిన రిపోర్టులో 9లక్షల 29వేల మంది మరణించారని వెల్లడించింది. దాదాపు రూ.620 లక్షల కోట్లు (8 ట్రిలియన్‌ డాలర్లు) ఖర్చు అయినట్లు వెల్లడించింది.