Assam : అస్సాంలో జనవరి 30 వరకు స్కూల్స్ బంద్..ఆంక్షలు మరింత కఠినం
అస్సాంలో జనవరి 30 వరకు స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆంక్షలు మరింత కఠినం చేయాలని ఆదేశించింది.

Schools Closed In Assam
Assam : రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావంతో అస్సాం ప్రభుత్వం స్కూల్స్ మూసివేయాలని నిర్ణయించింది. జనవరి 30 వరకు స్కూల్స్ మూసివేయాలని నిర్ణయించింది.ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్న క్రమంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.
భారత్ లో థర్డ్వేవ్ ప్రారంభమైన క్రమంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికే దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో 1700మందికిపైగా డాక్టర్లు మహమ్మారి బారినపడ్డారు. కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్డౌన్ దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఈక్రమంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో సంపూర్ణ లాక్డౌన్ విధించే పరిస్థితులు వస్తున్నాయి.
తాజాగా అస్సాం రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి అసోం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి కోవిడ్ -19 మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. దీంట్లో భాగంగా 5th class వరకు ఉన్న విద్యార్థులందరికీ జనవరి 30 వరకు స్కూల్స్ మూసివేయాలని వెల్లడించింది.
అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా.. కర్ఫ్యూ సమయాలు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు ఉంటాయని వెల్లడించారు.
ఇక దేశంలో కూడా రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కొనసాగుతోంది. లక్షా 41,986 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 285 మంది మృతి చెందారు. అలాగే ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలోని 27 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,071 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.