పెళ్లి పీటలపై వధువు..తాళికట్టు శుభవేళ కోసం ఎదురు చూపులు..ఎంతకూ రాని వరుడు

UP Aligarh bride kept waiting in the pavilion groom not reach for marriage : పెళ్లి పీటలమీద కూర్చున్న వధువు..మెడలో తాళి కట్టే వరుడి కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. కానీ ఎంతకూ రాలేదు. ఆమె ఎదురు చూపులు ఫలించలేదు. వరుడు రాలేదు. తాళి కట్టలేదు. దీంతో అప్పటి వరకూ కళకళలాడిని కళ్యాణ మండపం మూగబోయింది. చిన్నబోయింది. కారణం?..వరుడికి ఇచ్చే కట్నకానుకలు సరిపోలేదట. యూపీలోని అలీగఢ్లో జరుగుతున్న ఒక పెళ్లి వేడుకలో వధువు తాళి కట్టించుకునే మహూర్తం కోసం ఎదురుచూపులు నిరాశగా మిగిలిపోయాయి.
వరుడు వరునికి ఇచ్చే కట్నకానుకల విషయంలో తేడాలు రావడంతో వారు కల్యాణమండపానికి వచ్చేది లేదని వరుడి తరపువారు తెగేసి చెప్పేశారు. దీంతో వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అలీగఢ్లో గాంధీపార్క్ పరిధిలోని సాస్ని గ్రామానికి చెందిన యువతికి ఔరంగాబాద్కు చెందిన యువకునితో డిసెంబరు 25న వివాహం జరగనుంది. పెళ్లికి సంబంధించి బంధువులందరికీ పెళ్లి కార్డులు కూడా పంచారు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి వేడుక ప్రారంభమైంది.
ముహూర్తానికి సమయం దగ్గర పడుతున్నా..వరుని తరపువారెవరూ కల్యాణమండపానికి రాలేదు. దీంతో ఆడపెళ్లివారికి ఆందోళన పెరిగింది. వరుని తరపువారికి ఫోన్ చేయగా..వధువు తరపున తమకు ఇస్తానన్న ఆరు లక్షల రూపాయలు కట్నంగా కావాలని డిమాండ్ చేశారు.
దీంతో వధువు తరపువారు బంధువుల దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు సేకరించి, వాటిని వరుని తరపు వారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అదే విషయాన్ని చెప్పారు. దీంతో తమకు ఇంకా రావాల్సిన నాలుగు లక్షల రూపాయలు తక్కువయ్యాయి కాబట్టి..అవి అందితేనే పెళ్లికి వస్తామని లేకుంటే రామని తెగేసి చెప్పారు. దీంతో అప్పటికప్పుడే మరో నాలుగు లక్షలు ఇచ్చుకోలేమని పెళ్లి తరువాత ఇస్తామని చెప్పారు వధువు తరపు వారు.
కానీ వరుడు బంధువులు ఒప్పుకోలేదు. డబ్బులు అందేవరకూ పెళ్లికి రామని తెగేసి చెప్పటంతో వధువు పెళ్లి పీటలమీదనే కన్నీరు పెడుతూ కూర్చోవాల్సి వచ్చింది. దీంతో వధువు తరపువారు మగపెళ్లి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.