ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో..

లాక్‌డౌన్ : జోర్డాన్‌లో చిక్కుకున్న‘ఆడు జీవితం’ మూవీ టీమ్..

  • Published By: sekhar ,Published On : April 1, 2020 / 12:25 PM IST
ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో..

Updated On : April 1, 2020 / 12:25 PM IST

లాక్‌డౌన్ : జోర్డాన్‌లో చిక్కుకున్న‘ఆడు జీవితం’ మూవీ టీమ్..

తమ సినిమా షూటింగ్ నిమిత్తం ఎడారిలో చిక్కుకున్నామని, స్వస్థలానికి తిరిగిరావడానికి ప్రభుత్వం సహాయం చేయాలని నటుడు, దర్శకుడు కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్తే.. కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు అన్ని రంగాల వారు తమ మ‌ద్ద‌తు తెలిపారు. సినిమా రంగం సైతం షూటింగ్‌ల‌ను, రిలీజ్‌ల‌ను వాయిదా వేసుకుంది. అయితే ఇలాంటి కష్ట కాలంలోనూ ఓ టీమ్ త‌మ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఇరుక్కుపోయింది.

మల్లూవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా బ్లెస్సీ ద‌ర్శ‌కత్వంలో  “ఆడుజీవితం” అనే సినిమా రూపొందుతుంది. మొన్నటివరకు ఈ సినిమా షెడ్యూల్ జోర్డాన్‌లో జరిగింది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో షూటింగ్ ఆపేయాల‌ని అక్కడి అధికారులు ఆదేశించారు. అయితే వెన‌క్కి వ‌చ్చి, తిరిగి మ‌ళ్లీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవడమంటే మాటలు కాదు, నిర్మాతకు ఖ‌ర్చు వాసిపోతుందని భావించిన యూనిట్ కొద్దిరోజుల తర్వాత షూటింగ్ చేసుకుందామని అక్కడే ఉండిపోయారు.

మొదట ఏప్రిల్ 10 వ‌ర‌కు షూటింగ్ చేసుకోవడానికి జోర్డాన్ అధికారుల నుంచి ప‌ర్మిష‌న్ తీసుకున్నారు. ముందు ఆమోదం తెలిపిన అధికారులు కరోనా కారణంగా ప‌రిస్థితిలు మారిపోతున్న నేపథ్యంలో పర్మిషన్ క్యాన్సిల్ చేసేశారు. దీంతో టీమ్ స‌భ్యులు 58 మంది జోర్డాన్ ఎడారిలో చిక్కుకుపోయారు. ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. తినడానికి తిండి తాగడానికి నీరు సైతం అందుబాటులో లేవని, కేర‌ళ‌కు తిరిగి వ‌ద్దామ‌న్నా విమానాల రాక‌పోక‌లు నిలిచిపోయాయని వాపోయాడు. ప్ర‌భుత్వ సాయం లేనిదే కేర‌ళ‌కు రావ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని వాపోయాడు. మా స‌మస్య‌కు ప్ర‌భుత్వ‌మే ప‌రిష్కారం చూపాల‌ని లేఖ‌లో అభ్య‌ర్థించాడు. తాజాగా హీరో పృథ్వీరాజ్ కూడా ఓ లెటర్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు.