Karthi : హీరో కార్తీ సినిమా వివాదం.. క్షమాపణలు చెప్పిన నిర్మాత..
గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో జరుగుతున్న ‘పరుతివీరన్’ వివాదానికి.. నిర్మాత క్షమాపణలతో తెర పడినట్లు అయ్యింది.
![Karthi : హీరో కార్తీ సినిమా వివాదం.. క్షమాపణలు చెప్పిన నిర్మాత.. Karthi : హీరో కార్తీ సినిమా వివాదం.. క్షమాపణలు చెప్పిన నిర్మాత..](https://10tv.in/wp-content/uploads/2023/11/Gnanavel-Raja-say-sorry-to-Ameer-on-Karthi-paruthiveeran-movie-controversy.jpg)
Gnanavel Raja say sorry to Ameer on Karthi paruthiveeran movie controversy
Karthi : గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో కార్తీ మొదటి సినిమా ‘పరుతివీరన్’ విషయంలో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తుంది. ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తమిళనాట హాట్ టాపిక్ అయ్యారు. ఈ వివాదం వల్ల హీరో సూర్య, కార్తీ పేరులు కూడా గట్టిగా వినిపించాయి. ఎందుకంటే కార్తీ మొదటి సినిమా కావడం, నిర్మాత జ్ఞానవేల్ సూర్య ఫ్యామిలీకి చాలా మంచి సన్నిహితుడు కావడం.
ఇక ఇటీవల ఈ వివాదంలోకి దర్శకుడు మరియు నటుడు సముద్రఖని ఎంట్రీ ఇచ్చి జ్ఞానవేల్ పై ఫైర్ అయ్యారు. “నీకు ఎంత ధైర్యం ఉంటే దర్శకుడు అమీర్ పై ఆరోపణలు చేస్తావు. నీకు, కార్తీకి లైఫ్ ఇచ్చింది అతను” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ వివాదానికి ఒక ముగింపు వేస్తూ జ్ఞానవేల్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
”పరుతివీరన్ సమస్య గత 17 ఏళ్లుగా కొనసాగుతోంది. నేను ఈరోజు వరకు దాని గురించి మాట్లాడలేదు. నేనెప్పుడూ ఆయన్ను ‘అమీర్ అన్నా’ అని పిలుస్తాను. మొదటి నుంచి మా కుటుంబానికి సన్నిహితుడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన నా గురించి చేసిన తప్పుడు ఆరోపణలు నన్ను చాలా బాధించాయి. ఆయన మాటలకు బదులిచ్చే క్రమంలో నేను వాడిన కొన్ని పదాలు తన మనోభావాలను గాయపరిచినట్లయితే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నాతో పాటు ఎంతోమందిని ఆదుకునే చిత్ర పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నారు.
Also read : Kurma Nayaki : మనుషుల నుంచి దేవుడిని దెయ్యాలు రక్షించే కథ విన్నారా..?
.@GnanavelrajaKe sir issues a statement of clarification.#Paruthiveeran pic.twitter.com/7LVzmtU77B
— Studio Green (@StudioGreen2) November 29, 2023
అసలు ఏమైందంటే.. ఇటీవల కార్తీ నటించిన 25వ సినిమా ‘జపాన్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కార్తీ 25 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులందర్నీ అతిథులుగా ఆహ్వానించారు. అయితే ఆ ఈవెంట్ కి అమీర్ తప్ప మిగతా దర్శకులంతా హాజరయ్యారు. ఈ విషయాన్ని అమీర్ ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. ‘నాకు ఆహ్వానం అందలేదు. జ్ఞానవేల్ వల్ల నాకు కార్తీ, సూర్య మధ్య గ్యాప్ వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలకు జ్ఞానవేల్ బదులిస్తూ.. ‘పరుతివీరన్ సినిమా సమయంలో అమీర్ తమని మోసం చేశాడని, తప్పుడు లెక్కలు చూపించి డబ్బు దోచుకున్నారని’ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో వివాదం మొదలైంది.