ఫ్రైడే రిలీజ్.. ఆహా ద్వారా నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు జీవా ‘జిప్సి’..

‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో అంబేద్ కుమార్ నిర్మించిన చిత్రం ‘జిప్సి’. జూలై 17న తెలుగు ఓటీటీ ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో…
జీవా మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి సినిమాకు హద్దులు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు అన్నీ రకాల సినిమాలను, వెబ్ సిరీస్లను చూస్తున్నారు. నేను కూడా అలాగే విదేశీ భాషలు, తెలుగు సినిమాలు చూశాను. ఓ నటుడిగా అన్నిరకాల సినిమాలను చేయాలనే భావిస్తాను. అందుకనే ఓ ఫార్మేట్ సినిమాలను చేయకుండా డిఫరెంట్ మూవీస్ చేశాను. నేను బాలీవుడ్లో నటించిన ‘83’ సినిమా కూడా యూనివర్సల్ మూవీ. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సినిమాలను భాషా బేధంతో చూడకూడదు. అందులో నటించేటప్పుడు కూడా భాషతో మనకు అవసరం ఉండదు. యాక్టర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు చేయాలనే అనుకుంటాను. నిర్మాత తనయుడిగా చాలా రకాల కథలను వింటూ ఉంటాను. జిప్సీకి ప్రపంచమే ఇల్లు.. హీరోయిన్ నటాషాకు ఇల్లే ప్రపంచం. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాల వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేదే ఈ సినిమా’’ అన్నారు.
చిత్ర దర్శకుడు రాజు మురుగన్ మాట్లాడుతూ.. ‘‘నేను జర్నలిస్ట్. నేను ట్రావెల్ను బాగా ఇష్టపడతాను. చాలా ప్రాంతాలకు ట్రావెల్ చేశాను. ఆ క్రమంలో నేను జిప్పి తరహా పాత్రలను చూశాను. నేను చూసిన క్యారెక్టర్స్ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథను తయారు చేసుకున్నాను. అలాగే మన సమాజంలో సమానత్వం, యూనిటీ లేదు. అందువల్లనే ఘర్షణలు జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి ఓ పాయింట్ను ప్రధానాంశంగా ఈ సినిమాలో యాడ్ చేశాను. ఇలాంటి సినిమాలను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే సినిమా అనేది కళ. దాని ద్వారా మనం ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు దానికి కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దుల్లోనే చెబితే అది బావుంటుంది. దాన్ని దాటితేనే సమస్యలు వస్తాయి. జిప్పి తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందనే నమ్మం ఉంది’’ అన్నారు.
హీరోయిన్ నటాషా సింగ్ మాట్లాడుతూ.. ‘‘రాజుగారు నన్ను ఇంటర్వ్యూకి చెన్నై పిలిచారు. సెలక్ట్ చేసిన తర్వాత జీవా గారు హీరో అని చెప్పగానే హ్యాపీగా అనిపించింది. సినిమా అంతా నా చుట్టూనే తిరుగుతుంది. అసలు నా పాత్ర జిప్సి పాత్రకు ఎలా కనెక్ట్ అవుతుంది. తర్వాత ఏమౌతుందనే అంశాలను, ప్రస్తుత రాజకీయాలకు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు లింక్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.