Jeethu Jospeh : ప్రేమ కోసం సినిమాలని వదిలేసిన వ్యక్తి.. ఇప్పుడు మలయాళం స్టార్ డైరెక్టర్..

ఇప్పుడు మలయాళంలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న జీతూ జోసెఫ్ తన ప్రేమ కోసం ఒకప్పుడు సినిమాలని వదిలేసిన సంగతి మీకు తెలుసా?

Jeethu Jospeh : ప్రేమ కోసం సినిమాలని వదిలేసిన వ్యక్తి.. ఇప్పుడు మలయాళం స్టార్ డైరెక్టర్..

Malayalam Star Director Jeethu Jospeh once upon a time Leaves Movies for his Love

Jeethu Jospeh : గత కొన్నాళ్లుగా మలయాళ సినీ పరిశ్రమ(Malayalam Movies) అంటే మంచి సినిమాలు అందిస్తారని అందరికి అభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా దృశ్యం(Drishyam) సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయ్యాయి మలయాళం సినిమాలు. ఇప్పటికే దృశ్యం సినిమా మూడు ఇండియన్ భాషలు, మూడు బయటి భాషల్లో రీమేక్ అవ్వగా ఇంకో రెండు దేశాల్లో కూడా రీమేక్ అవ్వబోతుంది. ఆ రేంజ్ సినిమా తీసిన దర్శకుడు జీతూ జోసెఫ్. ఇప్పుడు మలయాళంలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న జీతూ జోసెఫ్ తన ప్రేమ కోసం ఒకప్పుడు సినిమాలని వదిలేసిన సంగతి మీకు తెలుసా?

 

జీతూ జోసెఫ్ తండ్రి కేరళలో ఎమ్మెల్యే. ఇంటర్ చదువుతున్న సమయంలో జీతూ జోసెఫ్ కి సినిమాల పిచ్చి పట్టింది. ఇంట్లో సినిమాల్లోకి వెళ్తానంటే ముందు డిగ్రీ పూర్తి చెయ్యి అన్నారు. డిగ్రీ చదువుతుండగా ఒకసారి చర్చిలో లిండా అనే అమ్మాయిని చూసి బాగా నచ్చడంతో డైరెక్ట్ గా వెళ్లి తన ప్రేమ విషయం చెప్పేసాడు. ఆ అమ్మాయి లైట్ తీసుకొని వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం ఏకంగా తన ఫ్యామిలీని తీసుకెళ్లి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడంతో ఆశ్చర్యపోయింది. అప్పుడు లైఫ్ లో ఏం చేస్తావ్ అని లిండా అడిగితే.. సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నా అన్నాడు. సినిమా వాళ్ళు అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నేను కావాలా.. సినిమా కావాలా అని లిండా అడిగేసరికి ఏం చేయాలో తెలియక అప్పటికి ప్రేమించిన అమ్మాయి కోసం సినిమాలని వదిలేసి లిండాని పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత తన బిజినెస్ లు చేసుకుంటున్నా సినిమా కోసం బాధపడేవాడు. అది గమనించిన లిండా సినిమాల్లోకి వెళ్ళమని చెప్పడంతో అప్పుడు జీతూ జోసెఫ్ ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. ఆ తర్వాత ఓ కథ రాసుకొని సినిమా మొదలుపెడదాం అనుకున్న సమయానికి సినిమా ఆగిపోయింది. తర్వాత మలయాళం స్టార్ హీరో సురేష్ గోపికి కథ చెప్పి ఓకే చేసుకున్నా నిర్మాత దొరక్కపోవడంతో జీతూ జోసెఫ్ వాళ్ళ అమ్మ తమ ఆస్తి ఇచ్చి సినిమా తీయమంది. దీంతో జీతూ జోసెఫ్ మొదటి సినిమా డిటెక్టివ్ తీసి రిలీజ్ చేయగా ఆ సినిమా పెద్ద విజయం సాధించింది.

Also Read : Chiranjeevi : నంది అవార్డుకు గద్దర్ పేరు పెట్టడంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు

అక్కడుంచి జీతూ జోసెఫ్ వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా హిట్స్ కొట్టాడు. ఇప్పటికి జీతూ జోసెఫ్ 17 సినిమాలు తీయగా అందులో ఏకంగా 13 హిట్ అయ్యాయి. ఇక జీతూ నుంచి ఐదో సినిమాగా మోహన్ లాల్, మీనా జంటగా దృశ్యం సినిమా వచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అయి ఇండియా వైడ్ పేరు తెచ్చింది. దీంతో జీతూ జోసెఫ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇటీవలే నేరు అనే సినిమాతో వచ్చి మరో హిట్ కొట్టాడు జీతూ జోసెఫ్. జీతూ కెరీర్ లో నాలుగు సినిమాలు మోహన్ లాల్ తోనే తీసాడు. ఈ నాలుగు మంచి విజయం సాధించాయి. తెలుగులో దృశ్యం 2 సినిమాని వెంకటేష్ తో ఈయనే తెరకెక్కించాడు. ఒకప్పుడు తన ప్రేమ కోసం సినిమాలనే వదిలేసుకున్న జీతూ జోసెఫ్ ఆ తర్వాత తన ప్రేమ సపోర్ట్ తోనే మళ్ళీ సినిమాల్లో రాణించడం గమనార్హం.