ఫ్యాన్ వార్ – అప్పుడు కత్తులతో పొడుచుకున్నారు.. ఇప్పుడు ఏకంగా చంపేశారు..

  • Publish Date - April 25, 2020 / 08:03 AM IST

తెరమీద విన్యాసాలు చేసే హీరో అంటే అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. అభిమానం హద్దులు మీరితే, అది కాస్తా పైత్యంగా మారి ప్రాణాలమీదకు తెస్తే.. వాళ్ల హీరో వచ్చి ప్రాణం తిరిగిస్తాడా?.. మన తెలుగునాట హీరోలు, వాళ్ల అభిమానుల మధ్య వార్ ఎలా ఉంటుందనే సంగతి తెలిసిందే. తమిళనాట ఇది కాస్త ఎక్కువే. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలివ్వడానికైనా, అవసరమైతే ప్రాణాలు తియ్యడానికైనా రెడీగా ఉంటారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానిని, దళపతి విజయ్ అభిమాని చంపేశాడు. కరోనాపై పోరాటానికి ఇరు హీరోలు ప్రకటించిన విరాళాల విషయంలో తలెత్తిన వివాదం ప్రాణాలమీదకు తెచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే.. యువ‌రాజ్ అనే యువ‌కుడు విజ‌య్‌, దినేష్ బాబు అనే యువ‌కుడు ర‌జినీకాంత్‌కు డైహార్డ్ ఫ్యాన్స్. వీరిద్దరి వయసు 22 సంవత్సరాలు. రీసెంట్‌గా హీరోలు ప్ర‌క‌టించిన క‌రోనా విరాళాల గురించి ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింది. ఆ గొడ‌వ‌లో దినేష్‌ త‌న స్నేహితుడు యువ‌రాజ్‌ను తోశాడు. కింద ప‌డ్డ యువ‌రాజ్‌ త‌ల‌కు గాయ‌మై చనిపోయాడు. స్నేహితుడు చ‌నిపోవడంతో దినేష్ భ‌యంతో పారిపోయాడు. మరకణం పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేశారు. కరోనాపై పోరుకి రజినీకాంత్ రూ.50 లక్షలు, విజయ్ రూ.1.30 కోట్లు విరాళం ప్రకటించిన సంగతి తెలసిందే. గతేడాది రజినీకాంత్ ‘పేట’, అజిత్ ‘విశ్వాసం’ సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. అప్పుడు కూడా మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో బొమ్మ సూపర్ అంటూ ఇరు హీరోల అభిమానులు కత్తులతో పొడుచుకున్నారు.