ఐదు భాషల్లో ఆర్జీవీ ‘మర్డర్’.. ట్రైలర్ ఎప్పుడంటే..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్స్టార్’ సినిమాతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎల్లుండి ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ‘మర్డర్’ సినిమా ట్రైలర్కి సంబంధించిన వివరాలు ప్రకటించాడు. మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా వర్మ ‘మర్డర్’(కుటుంబ కథా చిత్రం) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు కూడా విడుదల చేశారు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదిని ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
జూలై 28వ తేదీ ఉదయం 9.08 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నట్టు తెలిపాడు. ఐదు భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే సారి ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించాడు. ఈ చిత్రంలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నిర్మాత నట్టి కుమార్ పిల్లలు నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ‘మర్డర్’ ట్రైలర్తో వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.