తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 నెలల తర్వాత సినిమా,
తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 నెలల తర్వాత సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్కు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొద్దిరోజులుగా హైదరాబాద్ లో మళ్లీ షూటింగ్స్ మొదలయ్యాయి. అంతా సందడిగా ఉంది. ఇంతలోనే టీవీ ఇండస్ట్రీ ఉలిక్కి పడేలా చేసింది కరోనా వైరస్ మహమ్మారి. షూటింగ్స్ కు మళ్లీ బ్రేక్ పడింది.
ఉలిక్కిపడిన సీరియల్ యూనిట్:
ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ లో ప్రసారమయ్యే ఓ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. మొదట ఆ నటుడికి జ్వరం, ఇతర లక్షణాలు కనిపించడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకున్నాడు. టెస్టుల్లో అతనికి పాజిటివ్గా తేలడంతో అతనితో పాటు నటిస్తున్న ఇతర నటుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆ సీరియల్ షూటింగ్ ను నిలిపివేసి యూనిట్ సభ్యులందరినీ క్వారెంటైన్కు తరలించారు. అలాగే ఆ నటుడి కాంటాక్ట్స్ను కూడా గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.
ఇండస్ట్రీలో భయాందోళనలు:
సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ నెల 11 నుంచి కొన్ని సీరియళ్ల షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ నెల 15 నుంచి దాదాపు అన్ని సీరియళ్ల షూటింగ్ లు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాయి. ఇంతలో నటుడికి కరోనా అనే వార్త టీవీ పరిశ్రమలో కలకలం రేపింది. టీవీ సీరియల్స్ కు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కరోనా రావడం భయాందోళనకు గురి చేస్తోందని వాపోయారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా:
లాక్ డౌన్ 5వ దశలో సడలింపుల తర్వాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్ను కలిసి సినీ, టీవీ షూటింగులకు అనుమతి పొందారు. అయితే షూటింగ్ లకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్, పీపీఈ కిట్లు ధరించడం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పింది. పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఇండోర్ లో మాత్రమే షూటింగ్స్ చేసుకోవాలంది. ఆ నిబంధనలు, మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్స్ చేస్తున్నా కరోనా సోకడం షాక్ కి గురి చేసింది.