‘రంగీలా’లో నాగ్, రజినీ, శ్రీదేవి.. సంచలన విషయాలు వెల్లడించిన ఊర్మిళ..
Urmila Matondkar about Rangeela: సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవిలతో సినిమా చేయాలనుకున్న ఆర్జీవీ వాళ్లకు బదులు వేరే స్టార్లతో ఎందుకు సినిమా చేయాల్సి వచ్చింది. ఏంటా సంగతి..
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కల్ట్క్లాసిక్ ‘రంగీలా’.. ఈ సినిమా ఇటీవలే 25 వసంతాలు పూర్తిచేసుకుంది. అమీర్ఖాన్, ఊర్మిళ, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఏ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపాయి. డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో సాగే స్టోరీ, సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైన్ పరంగా అప్పట్లో ఈ సినిమా కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. రంగీలా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఊర్మిళ ఇటీవల ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.
‘ముందుగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల కోసం నాగార్జున, శ్రీదేవి, రజనీకాంత్లను అనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల రజనీకాంత్, నాగార్జున ఈ సినిమా చేయలేకపోయారు. ఆ తర్వాత వారి ప్లేసులో అమీర్ఖాన్, జాకీష్రాఫ్లను ఎంపిక చేశారు.
నాగార్జున, రజనీకాంత్ నటించినా ఈ సినిమా అదే స్థాయిలో గుర్తింపును సంపాదించుకునేది’ అని చెప్పారు ఊర్మిళ. శ్రీదేవిని ఆరాధించే ఆర్జీవీ ఈ సినిమాలో ఆమెను నటింపచేయాలని చాలా ప్రయత్నాలు చేసి, వీలు పడకపోవడంతో బాగా ఫీలయ్యాడట.