Bananas : అరటిపండ్లు తిన్న 120 మందికి అస్వస్థత..ఐదుగురి పరిస్థితి విషమం..
అరటి పండ్లు తిన్న 100మందికిపై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.

120 Ill After Consuming Bananas Prasad In Bihar's Vaishali
120 ill after consuming Bananas prasad : అరటి పండ్లు తిన్న 100మందికిపై తీవ్ర అస్వస్థతకు గురి అయి ఆస్పత్రిలో చేరిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అరటి పండ్లు తింటే అస్వస్థకు గురి కావటం ఏంటి? అని ఆశ్చర్యపోవచ్చు. బీహార్లోని వైశాలి జిల్లాలో జరిగిన ఈ ఘటనతో ఓ వార్డులో నివసిస్తున్నవారు ఆస్పత్రిపాలయ్యారు. అసలు విషయం ఏమిటంటే..
వైశాలి జిల్లాలోని పాతేపూర్ బ్లాక్లోని ఉన్న మహతి ధరంచంద్ పంచాయతీ వార్డు నెంబర్ 10లో కొంతమంది సత్యనారాయణ స్వామి పూజలో ఇచ్చిన ప్రసాదాన్ని తిన్నారు. ఆ ప్రసాదం తిన్నవారంతా కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఊహించని ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వైద్య బృందంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే వైద్య సహాయం అందించారు. దీంతో బాధితులు కోలుకుంటున్నారు.
దీనిపై వైశాలి సివిల్ సర్జన్ డాక్టర్ అమితాబ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. వార్డు నెంబర్ 10లో ఆహారం కలుషితమైందని తెలిపారు. వెంటనే కోలుకోవటానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇచ్చామని వెల్లడించారు. అలాగే వారికి అవసరమైన మందుల్ని సరఫరా చేశామని తెలిపారు. కాగా..బాధితుల్లో ఐదుగురు ఆరోగ్యం క్షీణించింది. దీంతో వారిని పతేపూర్ హెల్త్ సెంటర్కు తరలించామని తెలిపారు.
ప్రసాదంగా పంచిపెట్టిన అరటి పండ్లలో కెమికల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అందుకే అవి తిన్నవారు అస్వస్థకు గురి అయ్యారని డాక్టర్లు గుర్తించారు. దీంతోపాటు అరటిపండ్లను ఉడకబెట్టడం వల్ల ప్రసాదం కలుషితమైందని.. ఇది తిన్న వారంతా అస్వస్థతతకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.