రెవెన్యూ మిగులులోనే రాష్ట్రం : తెలంగాణకు లక్షన్నర కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్ర ఏర్పడిన అనంతరం గత ఆరు ఏండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రూ. 1, 58, 735 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం లోక్ సభలో ఎంపీ కోమటిరెడ్డి వేసిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని, రాష్ట్రం రెవెన్యూ మిగులులోనే ఉందన్నారు.
రుణ జీఎస్ డీపీ నిష్పత్తి పెరుగుతున్నా..అది 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితులు, రాష్ట్ర ప్రభుత్వ మధ్యంతర ఆర్థిక విధాన ప్రకటన ప్రకారమే..ఉందన్నారు. అయితే..తెలంగాణకు అదనపు నిధులు విడుదల చేయడం లేదనడం నిజం కాదన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక..గత ఐదు సంవత్సరాల్లో రూ. 1, 41, 735 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిరన ధృవీకరణ పత్రాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, డిపార్ట్ మెంట్లు, నీతి ఆయోగ్లు సాధారణ ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తాయన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
* గ్రామీణాభివృద్ధి కోసం రూ. 3,853.44 కోట్లు
* ఉన్నత విద్య, అక్షరాస్యత కోసం రూ. 2,994 కోట్లు
* పారిశుధ్యం, తాగునీటి కోసం రూ. 2,189 కోట్లు.
* వైద్య ఆరోగ్యం కోసం రూ. 1,852.54 కోట్లు.
* పట్టణాభివృద్ధికి రూ. 1,752.78 కోట్లు.
* వ్యవసాయం కోసం రూ. 1,078 కోట్లు.
* మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 993.85 కోట్లు.
* జాతీయ రహదారుల కోసం రూ. 763.36 కోట్లు.
* గిరిజానభివృద్ధి కోసం రూ. 485.84 కోట్లు.
* సామాజిక న్యాయం, సాధికారిత కోసం రూ. 388.14 కోట్లు.
* మైనార్టీల సంక్షేమం కోసం రూ. 296.51 కోట్లు.