Chidambaram Comments : 2019 ఎన్నికల్లో కన్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం జోస్యం చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. హిందూ మతానికి లేదా హిందువులకు ఎలాంటి ముప్పు లేదన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని రక్షకుడిగా చూపడానికి మొత్తం ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించడం బీజేపీ వ్యూహంలో భాగమని అన్నారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కీలక పాత్రధారిగా ఆయన అభివర్ణించారు. ఆమె సామర్థ్యంతో ఇండియా కూటమిని బలోపేతం చేస్తుందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు :
‘నేను అన్ని రాష్ట్రాల కోసం మాట్లాడలేను. తమిళనాడులో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా అంచనా వేయగలను. కేరళలో రెండు ఫ్రంట్లు (యూడిఎఫ్, ఎల్డిఎఫ్) 20 సీట్లను దక్కించుకుంటాయి. బీజేపీకి ఏమి ఉండవు. కర్నాటక, తెలంగాణా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాదరణ పొందాయి. 2019 కన్నా కాంగ్రెస్కు చాలా ఎక్కువ సీట్లు వస్తాయి’ అని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 52 సీట్లు :
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుందని, కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని పేర్కొన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ నుంచి ఇండియా కూటమి గురించి ప్రోత్సాహకరమైన నివేదికలు సైతం ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలను బుజ్జగించే రాజకీయాలు చేస్తుందని, దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ మోదీ ఆరోపించడం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహమని సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు అన్నారు.
మమతా బెనర్జీనే కీలక పాత్రధారి :
హిందూయిజం ప్రమాదంలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికలలో నిస్సందేహంగా.. మమతా బెనర్జీ కీలక పాత్రధారిగా ఉంటారని చెప్పారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్లో కోటను నిలబెట్టుకోవడంలో ఆమె సామర్థ్యం ఇండియ కూటమిని మరింత బలపరుస్తుందన్నారు.
కచ్చతీవు సమస్య పరిష్కారమైందని, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తడం ఏమిటని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సూటిగా ప్రశ్నించారు. ‘కచ్చతీవు క్లోజ్డ్ ఇష్యూ. 50 ఏళ్ల క్రితమే ఒప్పందం కుదిరింది. 2014 నుంచి ప్రధాని మోదీ అధికారంలో ఉన్నారు. గత 10 ఏళ్లుగా ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు?’అని కేంద్ర మాజీ మంత్రి ప్రశ్నించారు.
కచ్చతీవు సమస్య.. తమిళనాడు, శ్రీలంకలోని రామేశ్వరం మధ్య ఉన్న ద్వీపం చుట్టూ దశాబ్దాల నాటి ప్రాదేశిక, ఫిషింగ్ హక్కుల వివాదానికి సంబంధించినది. కాగా, లోక్సభ ఎన్నికలకు ముందు ఇదే అంశంపై బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also : Komatireddy Raj Gopal Reddy : బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి