ఢిల్లీ “జూ”లో బర్డ్ ఫ్లూ..గుడ్లగూబకి పాజిటివ్

Delhi Zoo ఢిల్లీ జూలో శనివారం(జనవరి-16,2020) తొలి బర్ద్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం పంజరంలో మృతిచెందిన గుడ్లగూబ మలద్వారం నుంచి, శ్వాస నాళం నుంచి, కంటి నుంచి స్వాబ్ను సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్లోని ల్యాబ్కు పంపించారు. పరీక్షల్లో గుడ్లగూబ మృతికి H5N8 ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణమని తేలింది. ఢిల్లీ లోని ల్యాబ్ కూడా దీన్ని ధృవీకరించిందని జూ డైరెక్టర్ రమేష్ పాండే తెలిపారు.
కాగా, ఇటీవల నగరంలోని కొన్ని పార్కుల్లో మరణించిన కొన్ని కాకులు, బాతుల శాంపిల్స్ ను కూడా భోపాల్ లోని ల్యాబ్ కే పంపగా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు పాండే వివరించారు. అయితే నగరంలోని పోల్ట్రీ ఫారాల్లో కోళ్ల శాంపిల్స్ కు మాత్రం నెగెటివ్ అని వచ్చిన విషయాన్నీ అయన గుర్తు చేశారు.
బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసు నేపథ్యంలో ఢిల్లీ జూ అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూలో శానిటైజేషన్, సర్వైలెన్స్ ప్రక్రియలను వేగవంతం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా నేషనల్ జువాలాజికల్ పార్కును సందర్శకులకు అనుమతించకుండా తాత్కాలికంగా మూసి వేశారు. రోజూ నిమ్మరసం స్ప్రే చేయడం, విక్రాన్-ఎస్, సోడియం హైపోక్లోరైట్ చల్లడం చేస్తున్నారు.
ఫ్లూ లక్షణాలున్న పక్షులను వేరుచేసి క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. జూలోకి బయటి వాహనాలు రాకుండా నిషేధం విధించారు. మాంసాహార జంతువులకు కోడి మాంసం ఇవ్వడాన్ని నిలిపేశారు. కాగా,దేశంలో ఇప్పటికే పది రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్రం ఆయా రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.