అధికారిక ప్రకటన.. మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపు సీఎంగా ప్రమాణం
ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్రలో సీఎం ఎవరన్న ఉత్కంఠ కొన్ని రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇవాళ జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించి, ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశం అనంతరం ముంబైలోని విధాన్ భవన్లో బీజేపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ ఉన్నారు.
రేపు ఆజాద్ మైదానంలో సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ కీలక నేతలు హాజరు అవుతారు. శివసేన నేత ఏక్నాథ్ షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశానికి ఆర్థిక రాజధాని ముంబై అని అన్నారు. మహారాష్ట్రలో స్టార్టప్లకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని చెప్పారు. మహారాష్ట్రలో భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు కనపడతాయని తెలిపారు. సమర్థ నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని అడ్డుకున్న పోలీసులు