దేశంలోకి వాళ్లే ఎక్కువగా వైరస్ను మోసుకొచ్చింది

తొలినాళ్లలో దేశంలోకి కరోనా వైరస్…అత్యధికంగా దుబాయ్, బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచే వచ్చినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(IIT)మండి అధ్యయనంలో తేలింది. జనవరి-ఏప్రిల్ మధ్య దేశానికి వచ్చిన కరోనా బాధితుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు.
వైరస్ వ్యాపించిన మొదట్లో వచ్చిన ప్రాథమిక డేటా విశ్లేషించి ఐఐటీ మండి ఈ పరిశోధన నిర్వహించింది. ఇందులో అత్యధికంగా దుబాయ్, యూకే నుంచే అత్యధిక కేసులు వచ్చినట్లు గుర్తించారు. దుబాయ్, యూకే ప్రయాణికుల ప్రైమరీ కాంటాక్టులకు వైరస్ సోకిందని, ఆ తర్వాత చాలా చోట్ల ఇది సామూహిక వ్యాప్తికి దారి తీసిందని అధ్యనయం చేసిన పరిశోధకులు తెలిపారు.
తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లో వైరస్… సామాజిక వ్యాప్తి జరగకుండా కొద్దిమేరకు అడ్డుకున్నారని.. అదే సమయంలో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జమ్ముకశ్మీర్, కర్ణాటకలోని కరోనా బాధితులు స్థానికంగా ప్రబలటానికి, అంతర్రాష్ట్ర వ్యాప్తికి కారణమయ్యారని ఈ అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధన ప్రకారం దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణికుల వల్లే అయినట్లు తెలుస్తోంది.