అయోధ్యలో 500 గుళ్లు కట్టినా అది మసీదు స్థలమే : ఉలేమా-ఏ-హింద్
అయోధ్యలో ఒకటి కాదు రెండు కాదు 500ల గుడులు నిర్మించినా అది మసీదు ప్రాంతమేనని జమియత్ ఉలేమా-ఏ-హింద్ అధినేత మౌలానా అర్షద్ మదనీ వ్యాఖ్యానించారు. అయోధ్య భూమి వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
దశాబ్దాల పాటు కొనసాగిన ఈ కేసు వివాదానికి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.అయోధ్యలో వివాదంగా కొనసాగిన 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని ‘రాముడి’కే అప్పగిస్తూ అంటే రామ మందిన నిర్మాణానికే అప్పగించింది. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయోధ్య భూ వివాద కేసు తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
దీంతో పిటీషన్ వేసిన జమియత్ ఉలేమా-ఏ-హింద్ అధినేత మౌలానా అర్షద్ మదనీ మాట్లాడుతూ..సుప్రీంకోర్టు నిర్ణయం మమ్మల్ని నిరాశకు గురి చేసిందని అన్నారు. అయినా దేశ అత్యున్నత ధర్మాసనం నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ అంటూనే అయోధ్యలో రామ మందిరానికి అప్పగించి 2.77 ఎకరాల స్థలంలో 500 ఆలయాలు నిర్మించినా అది బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతమేనని మౌలానా అర్షద్ మదనీ వ్యాఖ్యానించటం గమనించాల్సిన విషయం.
రామ జన్మభూమి కేసులో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నవంబర్ 9 న ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. వివాదాస్పద భూమి మొత్తం 2.77 ఎకరాలను దేవత ‘రామ్ లల్లా’కు అనుకూలంగా నిర్ణయించింది. అయోధ్యలో మసీదు నిర్మించడానికి ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని కేంద్రానికి ఆదేశించిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు నిర్ణయం ఏమైనప్పటికీ..మేం గౌరవిస్తాం..కాని సుప్రీం తీర్పుతో నిరాశకు గురయిన మాట వాస్తమన్నారు. ఎందుకంటే ఆలయం ఉన్న చోట బాబ్రీ మసీదు నిర్మించబడలేదని అంగీకరించినప్పటికీ కోర్టు ‘రామ్ లల్లా’కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మదాని అన్నారు.