GST Council Meet : చిరు వ్యాపారుల కోసం జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయాలు : నిర్మలా సీతారామన్
GST Council Meet : పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక మంత్రి సూచించారు.
![GST Council Meet : చిరు వ్యాపారుల కోసం జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయాలు : నిర్మలా సీతారామన్ GST Council Meet : చిరు వ్యాపారుల కోసం జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయాలు : నిర్మలా సీతారామన్](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/06/GST-Council-Meet-_-Biometric-authentication-among-10-big-announcement-by-FM-Nirmala-Sitharaman.jpg)
GST Council Meet _ Biometric authentication among 10 big announcement ( Image Source : Google )
GST Council Meet : చిరు వ్యాపారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. జీఎస్టీ మండలి 53వ సమావేశంలో చిరు వ్యాపారులకు మేలు కలిగించే కీలక నిర్ణయాలను తీసుకున్నామని ఆమె అన్నారు. ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించినట్టు తెలిపారు. ఆగస్టు చివరి వారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించినట్టు మంత్రి నిర్మలా పేర్కొన్నారు. రైల్వే ఫ్లాట్ఫామ్ టికెట్లు, ప్రయాణికులు బసచేసే గదులు, విశ్రాంతి గదులు, లగేజీ సేవలు, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలకు జిఎస్టీ తొలగించినట్టు కేంద్ర మంత్రి నిర్మల చెప్పారు.
Read Also : కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తులు చేసిన తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ.20వేల వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసినట్టు తెలిపారు. అన్ని రకాల సోలార్ కుక్కర్లపై 12 శాతం జీఎస్టీ, స్టీల్, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ, కూరగాయలు, పండ్ల కార్టన్ బాక్సులపై జీఎస్టీ 12 శాతం, స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.
జీఎస్టీ పరిధిలోకి ఇంధన ధరలు? :
మరోవైపు, పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక మంత్రి సూచించారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలు ఐక్యం కావాలని సూచించారు. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నామని నిర్మలా తెలిపారు.
జీఎస్టీ మండలిలో అనేక విషయాలు చర్చించామన్నారు. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తామన్నారు. జీఎస్టీపై ట్రైబ్యునల్స్, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచామన్నారు. చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలున్నాయని తెలిపారు.
ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి :
జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని, సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిందన్నారు. జీఎస్టీ కట్టేందుకు చివరితేదీ గడువు పొడిగించామని చెప్పారు. ఈ నిర్ణయాలతో వర్తకులు, ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు.
అక్రమాలు జరగకుండా ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నిర్మల చెప్పారు. మరోవైపు, రాష్ట్రాలు అభివృద్ధిని కొనసాగించడానికి పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహార బకాయిలను సమయానికి కేంద్రం చెల్లిస్తుందని తెలిపారు. కేంద్రం సూచించిన సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్లు వడ్డీలేని రుణాలు అందించే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలకు ఆర్థికమంత్రి నిర్మలా సూచనలు చేశారు.
Read Also : Lavu Srikrishna Devarayalu : టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు నియామకం