ఈ తీర్పును అంగీకరించలేం: హరియాణా ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు
హరియాణా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయని అన్నారు.

Jairam Ramesh
హరియాణా ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ తీర్పును అంగీకరించలేమంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. హరియాణా ఎన్నికల కౌంటింగ్పై కాంగ్రెస్ సందేహాలు లేవనెత్తింది. వ్యవస్థ గెలిచిందని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పింది.
ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరియాణా ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతామని అన్నారు. మొదట అభ్యర్థుల అభ్యంతరాలను ఎన్నికల సంఘం ముందుంచుతామని తెలిపారు. తమ నుంచి విజయాన్ని లాక్కున్నారని, హరియాణా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయని అన్నారు.
జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతామని, మహారాష్ట్రలో మహాకూటమిని కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని జైరాం రమేశ్ చెప్పారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాకు జేకేఎన్సీ, కాంగ్రెస్ కట్టుబడి ఉందని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కాగా, హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసింది.