Mahant Satyendra Das : అయోధ్య రామజన్మభూమి ఆలయం ప్రధాన పూజారి ఆరోగ్య పరిస్థితి విషమం.. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో..
శ్రీ సత్యేంద్ర దాస్ జీ స్ట్రోక్తో బాధపడుతున్నారు. డయాబెటిక్, హైపర్టెన్సివ్తో ఆదివారం SGPGIలో చేరారు.

Mahant Satyendra Das : అయోధ్య రామాలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ (85) అస్వస్థతకు గురయ్యారు. సత్యేంద్ర దాస్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను లక్నోలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సత్యేంద్ర దాస్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సత్యేంద్ర దాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బీపీ, షుగర్ తో ఆయన బాధపడుతున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమం..
ఆదివారం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. తాము అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారని చెప్పారు.
డయాబెటిక్, హైపర్టెన్సివ్తో బాధపడుతున్నారు..
”శ్రీ సత్యేంద్ర దాస్ జీ స్ట్రోక్తో బాధపడుతున్నారు. డయాబెటిక్, హైపర్టెన్సివ్తో బాధపడుతున్నారు. ఆదివారం SGPGIలో చేరారు. ప్రస్తుతం న్యూరాలజీ వార్డు హైడిపెండెన్సీ యూనిట్ (HDU)లో ఉన్నారు” అని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. “ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, వైద్యానికి ప్రతి స్పందిస్తున్నారు. ప్రస్తుతం నిశిత పరిశీలనలో ఉన్నారు” అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Also Read : సీఎం రేవంత్ సీరియస్.. అవన్నీ ముందే బయటకు ఎలా వెళ్లాయ్..!
రామాలయ ప్రారంభోత్సవంలో ముఖ్య పాత్ర పోషించారు..
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ ఘటన సమయంలో తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా ఉన్నారు సత్యేంద్ర దాస్. 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నిర్వాణి అఖాడాలో చేరారు. ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు.
ఇక, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో కీలక భూమిక పోషించారు సత్యేంద్ర దాస్. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. మహంత్ సత్యేంద్ర దాస్ ఆరోగ్య పరిస్థితి పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.